: 27న విజయవాడకు కేసీఆర్... దుర్గమ్మ మొక్కు తీర్చుకుంటున్న తెలంగాణ ముఖ్యమంత్రి!

ఈనెల 27న తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ విజయవాడ వెళుతున్నారు. ఈమేరకు ఆయన పర్యటన ఖరారైనట్టు సీఎం క్యాంపు కార్యాలయం వర్గాలు వెల్లడించాయి. తెలంగాణ ఉద్యమ సమయంలో తాను కనకదుర్గమ్మకు మొక్కిన మొక్కులను తీర్చుకునేందుకు కేసీఆర్ విజయవాడకు వెళ్లనున్నారని అధికారులు స్పష్టం చేశారు. ఆయన పర్యటనలో భాగంగా ఇంద్రకీలాద్రిపై దుర్గమ్మను దర్శించుకుని మొక్కులు చెల్లించుకుంటారని తెలిపారు. దుర్గమ్మకు బంగారు ముక్కుపుడకను కానుకగా ఇస్తానని కేసీఆర్ మొక్కుకున్న సంగతి తెలిసిందే.

సతీ సమేతంగా వచ్చి అమ్మవారికి పట్టువస్త్రాలను కూడా కేసీఆర్ సమర్పిస్తారని, దీంతో ఉద్యమ సమయంలో ఆయన పెట్టిన మొక్కులు దాదాపుగా తీరినట్టేనని అధికారులు తెలిపారు. కాగా, ఇప్పటికే తిరుమల వెంకన్నకు, తిరుచానూరు పద్మావతి అమ్మవారికి, వరంగల్ భద్రకాళి అమ్మవారికి, కురవి వీరభద్ర స్వామికి పెట్టిన మొక్కులను కేసీఆర్ తీర్చుకున్నారు. ఇక తన విజయవాడ పర్యటనలో భాగంగా ఏపీ సీఎం చంద్రబాబుతో కేసీఆర్ భేటీ కావచ్చని తెలుస్తోంది.

More Telugu News