: గౌరీ లంకేశ్ హత్య కేసులో రాహుల్ గాంధీ ఆరోపణలు.. తిప్పికొట్టిన నితిన్ గడ్కరీ
బీజేపీ-ఆర్ఎస్ఎస్కి వ్యతిరేకంగా మాట్లాడితే చంపేస్తున్నారని కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ ఆరోపించారు. నిన్న ప్రముఖ జర్నలిస్టు గౌరీ లంకేశ్ హత్యకు గురైన ఘటన గురించి రాహుల్ గాంధీ స్పందిస్తూ... ఈ విషయంపై తాను కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్యతో మాట్లాడానని అన్నారు. ఈ ఘటనకు పాల్పడిన వారిని గుర్తించి, కఠినంగా శిక్షించాలని ఆయన డిమాండ్ చేశారు. దేశంలో ప్రజాస్వామిక గొంతులను, అసమ్మతిని తొక్కే ప్రయత్నం చేస్తున్నారని రాహుల్ గాంధీ ఆరోపించారు.
ప్రధాని మోదీ స్కిల్డ్ హిందూత్వ రాజకీయ వేత్త అని రాహుల్ వ్యాఖ్యానించారు. మోదీ మాటల్లో ద్వంద్వార్థాలు ఉంటాయని అన్నారు. గౌరీ లంకేశ్ హత్య కేసులో రాహుల్గాంధీ చేసిన ఆరోపణలపై స్పందించిన కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ.. మోదీ ఏ ఒక్క పార్టీకో చెందిన నేత కాదని, ఆయన దేశ ప్రధాని అని వ్యాఖ్యానించారు. ప్రధానిని విమర్శించడం సిగ్గుచేటని అన్నారు. ఆ హత్యతో తమ పార్టీకి ఎటువంటి సంబంధమూ లేదని చెప్పారు. కర్ణాటకలో శాంతి భద్రతలను చూసే బాధ్యత ఆ రాష్ట్ర అధికార కాంగ్రెస్దేనని అన్నారు. సిద్ధరామయ్య ప్రభుత్వమే ఈ హత్యకు బాధ్యత వహించాలని వ్యాఖ్యానించారు.