: కేన్సర్‌పై గెలిచాక జీవితం విలువ తెలిసి వచ్చింది: బాలీవుడ్ నటి మనీషా కొయిరాలా

కేన్సర్‌తో జరిగిన పోరాటంలో విజయం సాధించిన బాలీవుడ్ నటి మనీషా కొయిరాలా తనకిప్పుడు జీవితం విలువ తెలిసి వచ్చిందని పేర్కొంది. ఒవేరియన్ కేన్సర్‌తో బాధపడిన మనీషా దానిని నుంచి బయటపడేందుకు చేసిన పోరాటం చూసి కేన్సరే వెనక్కి తగ్గింది. కేన్సర్ బారిన పడక ముందు మనీషా తన జీవితం గురించి పెద్దగా పట్టించుకోలేదు. జీవితానికి అంత విలువ ఇవ్వలేదు. కానీ ఇప్పుడు తనకు జీవితం విలువ తెలిసి వచ్చిందని పేర్కొంది.

‘‘కేన్సర్‌కు ముందు నా జీవితం అంత గొప్పగా ఏమీ లేదు. పెద్దగా పట్టించుకోలేదు కూడా. కానీ కేన్సర్‌తో బాధపడిన తర్వాత జీవితం గురించి తెలిసి వచ్చింది. చాలా కష్టాలు అనుభవించా. బోలెడంత డబ్బు ఖర్చు చేశా. అసంతృప్తి, బాధ, భయం నన్ను ఊపిరి పీల్చుకోనివ్వకుండా చేశాయి. అందుకే చెబుతున్నా.. జీవితాన్ని ఆనందించండి. దాని విలువను గుర్తించండి. మంచిగా బతకండి. ఎందుకంటే ఈ జీవితం మనకు దక్కిన ఓ బహుమతి’’ అని మనీషా పేర్కొంది.

కేన్సర్ నుంచి బయటపడ్డాక తిరిగి బాలీవుడ్‌లో అడుగుపెట్టిన మనీషా.. సంజయ్ దత్ బయో పిక్‌లో నర్గీస్ దత్ పాత్రలో నటించేందుకు సిద్ధమవుతోంది. రాజ్‌కుమార్ హిరానీ దర్శకత్వం వహించనున్నారు. ఓ గొప్ప సినిమాలో, ఫేవరెట్ దర్శకుడితో కలిసి పనిచేస్తున్నందుకు తనకు చాలా ఆనందంగా ఉందని మనీషా పేర్కొంది.

More Telugu News