: టీడీపీ వర్క్ షాపులో శిల్పా బ్రదర్స్ పై చంద్రబాబు సెటైర్లు!

శిల్పా బ్రదర్స్ మోహన్ రెడ్డి, చక్రపాణిరెడ్డిపై టీడీపీ అధినేత చంద్రబాబు వ్యంగ్యాస్త్రాలు సంధించారు. తాను లేకపోతే నంద్యాల పొద్దుగడవదని శిల్పా మోహన్ రెడ్డి అనుకున్నారని, రెండు నెలల్లోనే తమ్ముడు చక్రపాణిరెడ్డి పదవి కూడా ఊడిపోయిందని అమరావతిలో జరిగిన పార్టీ వర్క్ షాపులో చంద్రబాబు సెటైర్లు వేశారు. ‘పార్టీలో చేరికలపై టీడీపీ నేతలు విశాల దృక్ఫథంతో ఉండాలి. చేరికలతో పార్టీ బలపడాలి..మీరూ బలపడాలి. ఎవరూ పార్టీలోకి రాకూడదనే ధోరణి మంచిది కాదు.

సొంత పేపర్, ఛానెల్ లేకుండానే నంద్యాల, కాకినాడ ఎన్నికల్లో విజయం సాధించాం. పేపర్, ఛానెల్ ఉన్న విపక్షం ఘోరంగా విఫలమైంది. గతంలో పార్టీకి దూరమైన వర్గాలు ఈ ఎన్నికల్లో టీడీపీకి దగ్గరవడమే అసలు విజయం. ఓటు బ్యాంకును కాపాడుకుందాం. కొత్త ఓటు బ్యాంకును సాధించుకోవడంతో గెలుపు సాధ్యమైంది. కులమతాలు, ప్రాంతాల వారీగా రెచ్చగొట్టేందుకు విపక్షం ప్రయత్నించింది. రాష్ట్ర ప్రయోజనాల కోసం ప్రజలు పెద్ద పీట వేశారు’ అని అన్నారు. విజయవాడలో ఒక నాయకుడు మరో కులాన్ని రెచ్చగొట్టారని, దీంతో ఆ సామాజిక వర్గం వాళ్లు ధర్నా చేశారని అన్నారు. వైసీపీలో వాళ్లు వాళ్లూ కొట్టుకుని నగరంలో అశాంతిని రేకెత్తించారని చంద్రబాబు విమర్శించారు.

More Telugu News