: కీలక నిర్ణయం తీసుకున్న ఖైరతాబాద్ గణేశ్ ఉత్సవ సమితి!
పర్యావరణానికి కలిగే దుష్పరిణామాలను దృష్టిలో ఉంచుకుని హైదరాబాద్లోని ఖైరతాబాద్ గణేశుడి ఎత్తును ఉత్సవ కమిటీ నాలుగేళ్ల నుంచి ఒక్కో అడుగూ తగ్గిస్తూ వస్తోన్న విషయం తెలిసిందే. అయితే, వచ్చే ఏడాది మాత్రం 80 నుంచి 100 అడుగుల ఎత్తైన మట్టి విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని ఖైరతాబాద్ గణేశ్ ఉత్సవ సమితి నిర్ణయం తీసుకుంది. దీని వల్ల పర్యావరణానికి కూడా హాని కలగదని భావిస్తోంది. ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన ఖైరతాబాద్ గణేశుడు నాలుగేళ్ల క్రితం వరకు ప్రతి ఏడాది ఒక్కో అడుగు ఎత్తు పెరుగుతూ కనిపించేవాడు. అయితే గణేశుడి విగ్రహం ఎత్తు కొన్నేళ్లుగా ఎత్తు తగ్గుతూ వస్తుండడంతో భక్తులు కూడా కాస్త నిరాశ చెందుతున్నారు.
మరోవైపు నగరంలో ఎత్తైన విగ్రహాలపై గతంలో హైకోర్టు పలు నిబంధనలు పెట్టింది. అన్నింటినీ దృష్టిలో పెట్టుకుని ఖైరతాబాద్ గణేశుడిని ఇకపై మట్టితో తయారు చేయాలని నిర్ణయించారు. మట్టి గణపతి విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామని తాము గతంలో గవర్నర్కు హామీ కూడా ఇచ్చామని ఉత్సవ సమితి అధ్యక్షుడు సుదర్శన్ తెలిపారు. మట్టి గణపతిని తయారు చేయడానికి శిల్పి రాజేంద్రన్ ఒప్పుకున్నారని చెప్పారు.