: తెలుగు వారందరూ బాధపడే రోజు వైఎస్సార్ వర్ధంతి రోజు!: ఏపీసీసీ అధ్య‌క్షుడు ర‌ఘువీరారెడ్డి

రాష్ట్ర ప్రజలే కాకుండా దేశంలో, ప్ర‌పంచంలో ఉన్న ప్ర‌తి తెలుగువారు బాధ‌ప‌డే రోజు వైఎస్ రాజ‌శేఖ‌ర్‌రెడ్డి వ‌ర్ధంతి రోజని ఏపీ కాంగ్రెస్ నేతలు అన్నారు. ఈ రోజు విజ‌య‌వాడ‌లోని ఏపీసీసీ కార్యాల‌యంలో మాజీ ముఖ్య‌మంత్రి వై.ఎస్‌. రాజ‌శేఖ‌ర్ రెడ్డి 8వ వర్ధంతి కార్య‌క్ర‌మం జ‌రిగింది. ఈ కార్య‌క్ర‌మంలో ఏపీసీసీ అధ్య‌క్షుడు ర‌ఘువీరారెడ్డితో పాటు రాజ్య‌స‌భ సభ్యుడు కె.వి.పి. రామ‌చంద్ర‌రావు త‌దిత‌రులు పాల్గొని వైఎస్ఆర్ చిత్ర‌ప‌టానికి పూలమాల వేసి నివాళుల‌ర్పించారు.

ఈ సంద‌ర్భంగా ర‌ఘువీరారెడ్డి మాట్లాడుతూ.. యువ‌జ‌న కాంగ్రెస్ నేత‌ నుంచి ముఖ్య‌మంత్రి వ‌ర‌కు అనేక అవ‌కాశాల‌ను కాంగ్రెస్ పార్టీ ఇచ్చినప్పుడు వైఎస్ఆర్‌ నిజాయతీగా ప‌నిచేశారని అన్నారు. ఎంత మంది రెచ్చ‌గొట్టినా కాంగ్రెస్ పార్టీయే శ్రీ‌రామ‌ర‌క్ష అని ఆయ‌న త‌న‌ చివ‌రి శ్వాస వ‌ర‌కు కాంగ్రెస్ లోనే ఉన్నార‌ని అన్నారు. రాష్ట్ర ప్ర‌జ‌ల్లో 'ఇందిర‌మ్మ రాజ్యం' ఇది అంటూ ఒక ధైర్యాన్ని నింపారని అన్నారు. ఇప్పుడు ఆయ‌న సిద్ధాంతాలనే కేంద్ర‌ంలో, రాష్ట్రంలో అంద‌రూ కాపీ కొడుతున్నారని అన్నారు. పేద‌ కుటుంబాల పిల్ల‌లు కూడా నేడు డాక్ట‌ర్లు, ఇంజ‌నీర్లు అయ్యారంటే అది వైఎస్ఆర్ చొర‌వేన‌ని అన్నారు. 

More Telugu News