: ముంబైలో కొలువైన `జీరో జీఎస్టీ` గణేశుడు!
వస్తు సేవల పన్ను (జీఎస్టీ) పరిధిలోకి రాని 81 వస్తువుల్లో 10 వస్తువులతో ఉపయోగించి గణేశుడిని తయారు చేసి ప్రతిష్టించారు ముంబైలోని ములుంద్ ప్రాంతానికి చెందిన శ్రీనివాస్ గణేశ్ ఉత్సవ్ కమిటీ మండలి సభ్యులు. ఇందుకోసం వీరు మట్టిపాత్రలు, ఉప్పు, పూజా సామాగ్రి, ఖాదీ దారం, పలక, గాజులు, సంగీత వాయిద్యాలు, చీపురుకట్ట, గాంధీ టోపీలను ఉపయోగించారు. `నిజానికి మేం స్వచ్ఛభారత్ ఇతివృత్తంగా గణేశుడిని తయారు చేద్దామనుకున్నాం. కానీ జీఎస్టీ గురించి ప్రజల్లో భిన్నాభిప్రాయాలు ఉన్న నేపథ్యంలో ఈ జీరో జీఎస్టీ గణేశుడి ద్వారా జీఎస్టీ విధానంలో ఉన్న సదుపాయాలను తెలియజేయాలని ఇలా చేశాం` అని మండలి సభ్యుడు దీపేశ్ యాదవ్ చెప్పాడు.
పూజలు పూర్తయ్యాక ఈ వినాయకుడిని నిమజ్జనం చేయకుండా, తయారీకి ఉపయోగించిన వస్తువులను పంచిపెడతామని దీపేశ్ తెలిపాడు. అయితే వినాయకుడి ఉదర భాగం కోసం వాడిన టాటా సాల్ట్ ప్యాకెట్లు జీఎస్టీ పరిధిలోకి వస్తాయి కదా? అని సందేహం వ్యక్తం చేయగా - `ఒక్క లోపం ఉందని భక్తిని కోల్పోకూడదు. జీఎస్టీ విధానాన్ని అర్థం చేసుకోవడం కోసమే ఇలా చేశాం. అవసరమైన వస్తువుల ధరలు పెరిగాయని భవిష్యత్తులో వచ్చే జీఎస్టీ లాభాలను ప్రజలు పట్టించుకోలేదు. దీని గురించి చెప్పడానికే మేం ఈ వినాయకుడిని ప్రతిష్టించాం` అని మరో సభ్యుడు కల్పేశ్ వివరించాడు.