: రెండు మూడు రోజుల్లో ‘ఎన్టీఆర్’ సినిమా దర్శకుడిని ప్రకటిస్తాం : సినీ నటుడు బాలకృష్ణ

టీడీపీ వ్యవస్థాపకుడు, నాటి నటుడు, తన తండ్రి ఎన్.టి.రామారావు జీవిత కథ ఆధారంగా ‘ఎన్టీఆర్’ చిత్రాన్ని రూపొందించనున్నట్టు ప్రముఖ నటుడు బాలకృష్ణ ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే, ఈ చిత్ర దర్శకుడు ఎవరనేది   ఇంతవరకూ ప్రకటించలేదు. ఈ విషయమై పాత్రికేయులతో బాలకృష్ణ మాట్లాడుతూ, రెండు మూడు రోజుల్లో ఈ చిత్ర దర్శకుడిని ప్రకటిస్తామని, సినిమా త్వరలోనే ప్రారంభిస్తామని చెప్పారు. స్క్రిప్ట్ పనులు వేగంగా జరుగుతున్నాయని చెప్పిన బాలయ్య, తమ బంధువులను, ఎన్టీఆర్ సహచరుల్ని, ఆయన దగ్గర పని చేసిన అధికారుల్ని కలిసి వివరాలు సేకరిస్తున్నట్టు చెప్పారు.

 ఈ సినిమా విషయమై ఇటీవలే తాను చెన్నైకు వెళ్లి వచ్చానని, తన తండ్రి సినీ రంగానికి రాకముందు విషయాలు చాలా ఆసక్తికరంగా అనిపించాయని చెప్పారు. కాగా, నంద్యాల ఉప ఎన్నికల్లో టీడీపీ ఘన విజయం సాధించడంపై ఆయన్ని ప్రశ్నించగా,  ‘ఈ విజయం నేను ఊహించిందే. టీడీపీ చేస్తున్న అభివృద్ధి పనుల్ని చూసే ఈ విజయాన్ని ప్రజలు అందించారు’ అని బాలయ్య సంతోషం వ్యక్తం చేశారు.

More Telugu News