: 15 మంది టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, 8 మంది మంత్రులు... కాంగ్రెస్ లోకి జంప్ చేసేందుకు సిద్ధమన్న భట్టి విక్రమార్క

కేసీఆర్ వైఖరిపై విసిగిపోయిన టీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు అతి త్వరలో కాంగ్రెస్ పార్టీలోకి రానున్నారని, దీంతో రాష్ట్ర రాజకీయ ముఖచిత్రం సమూలంగా మారిపోనుందని తెలంగాణ పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మల్లు భట్టి విక్రమార్క వెల్లడించారు. మీడియాతో ఇష్టాగోష్టి నిర్వహించిన ఆయన, టీఆర్ఎస్ కు చెందిన ఏడెనిమిది మంది మంత్రులు, 15 మంది వరకూ ఎమ్మెల్యేలు తమ నేతలతో టచ్ లో ఉన్నారని, వారంతా సమయం కోసం ఎదురుచూస్తున్నారని అన్నారు. తెలుగుదేశం పార్టీ నుంచి కూడా వలసలు ఉంటాయని తెలిపారు.

వరంగల్ జిల్లాకు చెందిన మహిళా ఎమ్మెల్యే తమతో మాట్లాడుతూ ఉన్నారని, అన్ని జిల్లాల నుంచీ ప్రజా ప్రతినిధులు కాంగ్రెస్ పార్టీలోకి రానున్నారని, కేసీఆర్ నియంతృత్వ వైఖరితో పాటు, ప్రభుత్వంపై ప్రజల్లో పెరుగుతున్న వ్యతిరేకతే ఇందుకు కారణమని అన్నారు. తమ పార్టీ నుంచి టీఆర్ఎస్ లోకి వెళ్లినవారిలో కొందరు కోవర్టులుగా పనిచేస్తున్నారని, వారు కూడా వెనక్కు వస్తారని తెలిపారు. మంత్రుల పేర్లను వెల్లడించాలని మీడియా కోరగా, వారి పేర్లు చెబితే, ఇబ్బందని, ప్రత్యర్థి శిబిరం అప్రమత్తం అయ్యే అవకాశాన్ని ఇవ్వలేమని, 2019లో తమ పార్టీ అధికారంలోకి వచ్చి తీరుతుందని అన్నారు.

More Telugu News