: పాత నోట్ల మార్పిడి వ్యవహారం... 17 వేల సంస్థలపై కేంద్రం కొరడా!

17,000 సంస్థలపై చర్యలకు కేంద్రం ఉపక్రమిస్తోంది. గత నవంబర్ 8న పెద్ద నోట్ల రద్దు నిర్ణయం అనంతరం వివిధ మార్గాల్లో పాత నోట్లను మార్చేందుకు సహకరించిన సంస్థలను కేంద్ర ప్రభుత్వం గుర్తించింది. ఇవి దేశ వ్యాప్తంగా 17,000 ఉన్నట్టు నిర్ధారించుకుంది. ఈ నేపథ్యంలో ఆ కంపెనీలపై చర్యలు తీసుకునేందుకు రంగం సిద్ధం చేస్తోంది. ఈ జాబితాలో ఇన్వెస్ట్ మెంట్ కన్సల్టెన్సీలు, రియల్ ఎస్టేట్ ఆర్గనైజేషన్స్, స్టార్, మీడియం హోటల్స్, రైస్ మిల్స్, జ్యుయలరీ షాపులు, సినీ నిర్మాణ సంస్థలు, మీడియా సంస్థలు కూడా ఉండడం విశేషం. వారు మార్చిన ధనమంతా నల్లధనం అని అధికారులు అంచనా వేస్తున్నారు.

 ఈ నేపథ్యంలో తీవ్ర మోసాల దర్యాప్తు కార్యాలయం (సీరియస్‌ ఫ్రాడ్‌ ఇన్వెస్టిగేషన్‌ ఆఫీసు-ఎస్‌ఎఫ్‌ఐఓ), ఆదాయపు పన్ను విభాగం (ఐ.టి.), కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ), ఎన్‌ ఫోర్స్‌ మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) సంస్థలు సంయుక్తంగా జాబితాను సిద్ధం చేశాయి. ఇందులో మొత్తం 16,749 సంస్థలు అక్రమాలకు పాల్పడినట్టు నిర్ధారించారు. ఈ మేరకు 43 ఆహార కంపెనీలు, 9 బియ్యం మిల్లులు, 860 స్థిరాస్తి, భవన నిర్మాణ కంపెనీలు, 150 ఉక్కు-లోహాల సంస్థలు, 40 ప్రకటనలు, మల్టీమీడియా సంస్థలు, రెండు కొత్త మీడియా కంపెనీలు, డజన్ల కొద్దీ ఆభరణాల దుకాణాలు, రెండు రేడియో సంస్థలు, వేలాది ఆర్థిక వ్యవహార సంస్థలతో కూడిన జాబితాను తయారు చేశారు.

వారు సమర్పించిన నివేదికల ఆధారంగా ఈ జాబితాను తయారు చేసినట్టు అధికారులు చెబుతున్నారు. ఇందులో 14,247 సంస్థలు తమ బ్యాంకు ఖాతాల్లో ఉన్న నగదు వివరాల కన్నా చాలా తక్కువ మోత్తాన్ని ఆదాయపు పన్ను రిటర్నుల్లో చూపించాయని ఐటీ అధికారులు తెలిపారు. రిటర్న్స్ కి, బ్యాంకు ఖాతాల్లో ఉన్న డబ్బుకి పొంతన కుదరడం లేదని, అంతే కాకుండా నోట్ల మార్పిడీ అనంతరం రద్దయిన వాటి స్థానంలో కొత్త నోట్ల మార్పిడికి అవకాశం ఉన్న 50 రోజుల వ్యవధిలో 4.62 లక్షల బ్యాంకు ఖాతాల్లో 25 లక్షల రూపాయల కంటే ఎక్కువ మొత్తం నగదు జమ అయినట్టు ప్రభుత్వం ప్రకటించిన సంగతి తెలిసిందే.

నోట్ల మార్పిడీ సందర్భంగా 23.87 లక్షల బ్యాంకు ఖాతాల్లో 5 లక్షల రూపాయల చొప్పున జమ అయినట్టు బ్యాంకులు ఐటీ విభాగానికి నివేదికలు పంపాయి. దీంతో ఖాతాల్లోని నగదు జమ వివరాలను విశ్లేషించి, దేశంలో 1.75 లక్షల డొల్ల కంపెనీలు ఉన్నట్టు లెక్కలు తేల్చారు. ఇందులో 400 కంపెనీలు ఒకే చిరునామాపై ఉండడం ఫ్రాడ్ జరిగిందని చెప్పడానికి బలమైన ఆధారాలుగా నిలిచాయి. ఈ నేపథ్యంలో పన్నుల ఎగవేతకు, అక్రమంగా నగదు చలామణి, అక్రమార్జన, నల్లధనం వంటి కేసుల్లో ఈ సంస్థలపై చర్యలు తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. 

More Telugu News