: కాకినాడలో ఉద్రిక్తత.. బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజుపైకి దూసుకెళ్లిన వైసీపీ కార్యకర్తలు!

కాకినాడ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల పోలింగ్ నేపథ్యంలో, అక్కడక్కడ చెదురుమదురు ఘటనలు, స్వల్ప ఉద్రిక్తతలు తలెత్తుతున్నాయి. 9వ డివిజన్ లో ఓటర్లకు వైసీపీ నేతలు డబ్బులు పంచుతున్నారంటూ వారిని అడ్డుకునే ప్రయత్నం చేశాయి బీజేపీ శ్రేణులు. దీంతో, బీజేపీ వర్గీయులపై వైసీపీ నేతలు దాడికి తెగించారు. బీజేపీ కార్యకర్తలు భయంతో అక్కడ నుంచి వెళ్లబోయారు. అయితే, అదే సమయంలో అక్కడకు బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు చేరుకున్నారు. దీంతో, ఆయన అండతో బీజేపీ వర్గీయులు మరోసారి బూత్ వద్దకు వెళ్లబోయారు.

ఈ సమయంలో మరోసారి ఇరు వర్గీయులకు మధ్య వాగ్వాదం జరిగింది. ఈ సందర్భంగా వైసీపీ శ్రేణులపై సోము వీర్రాజు మండిపడ్డారు. దీంతో ఆయనపైకి కూడా వైసీపీ వర్గీయులు దూసుకెళ్లే ప్రయత్నం చేయగా.... పోలీసులు అడ్డుకున్నారు. ఈ సందర్భంగా పోలీసులతో సోము వీర్రాజు మాట్లాడుతూ, అరాచకాలకు పాల్పడుతున్న వైసీపీ శ్రేణులపై ఎలాంటి చర్యలు తీసుకుంటారంటూ పోలీసులను ప్రశ్నించారు. అనంతరం, అక్కడ నుంచి వెళ్లిపోయారు.

More Telugu News