: బ్యాడ్మింటన్ వరల్డ్ చాంపియన్‌షిప్ ఫైనల్లో హద్దులు దాటిన సింధు ప్రవర్తన.. చివరికి ఎల్లోకార్డు అందుకున్న వైనం.. మోతెక్కిపోతున్న ట్విట్టర్!

రెండు రోజుల క్రితం గ్లాస్గోలో జరిగిన బ్యాడ్మింటన్ ప్రపంచ చాంపియన్‌షిప్‌లో తెలుగుతేజం పీవీ సింధు రజత పతకం సాధించి చరిత్ర సృష్టించింది. జపాన్‌కు చెందిన నోజోమి ఒకుహారాతో హోరాహోరీగా జరిగిన పోరులో చివరికి ఓటమి పాలైంది. అయితే ఈ మ్యాచ్‌లో సింధు ప్రవర్తన ఇప్పుడు హాట్‌ టాపిక్‌గా మారింది. మైదానంలో సింధు ప్రవర్తన సరిగా లేకపోవడం, బ్యాడ్మింటన్ చట్టాలను ఉల్లంఘించిందన్న కారణంతో అంపైర్ సింధుకు ఎల్లోకార్డు చూపించారు.

ప్రత్యర్థి కోర్టులోకి రాకెట్‌ను విసరడం, అంపైర్ అనుమతి లేకుండా మైదానం నుంచి బయటకు వెళ్లడం, కావాలని ఆటను ఆలస్యం చేయడం తదితర ఆరోపణలపై అంపైర్ ఆమెకు ఎల్లోకార్డు చూపించారు. ప్లేయర్ రెండు ఎల్లోకార్డులు కనుక అందుకుంటే అది రెడ్ కార్డుకు దారితీస్తుంది. అయితే ఇవే ఆరోపణలతో అంపర్ బ్లాక్ కార్డు కూడా చూపించే అవకాశం ఉంది. కాగా, సింధుకు ఎల్లోకార్డుపై ట్విట్టర్ మోతెక్కిపోతోంది. ఇటువంటివి పట్టించుకోకుండా సింధు ముందుకెళ్లాలని కొందరు, అంపైర్ ఎవరో స్కూల్ టీచర్‌లా ఉన్నాడని మరొకరు ఇలా ట్వీట్లతో హోరెత్తిస్తున్నారు.

More Telugu News