: ఆ పిల్లలకు నాన్న భారమైపోయాడు... ఓ తండ్రి దీన గాథ!

ఒకప్పుడు సైన్యంలో చేరి దేశానికి సేవ చేసిన మాజీ సైనికుడు, తన పిల్లల తీరుతో 96 ఏళ్ల వయసులో ఇప్పుడు జీవన పోరాటం ప్రారంభించాడు. ఆ వివరాల్లోకి వెళ్తే... ఆదమ్ షఫీ (96)1955లో సైన్యంలో చేరి సిపాయిగా విధులు నిర్వర్తించాడు. రిటైర్మెంట్ అనంతరం తన ఆరుగురు కుమారులు, ఇద్దరు కుమార్తెలతో గుంటూరులో స్థిరపడ్డాడు. 4 లారీలు, 4 ఇళ్లను కొని పిల్లలు నిలదొక్కుకునేందుకు సహాయం చేశాడు. అయితే వ్యసనాల బారిన పడ్డ కుమారులు ఆస్తిని హారతి కర్పూరం చేసేశారు. దీంతో అద్దె ఇళ్లకు మారిన కుమారులు తల్లిదండ్రులను పోషించేందుకు నిరాకరించారు.

అయితే వంతుల వారీగా వారిని పోషించేందుకు పిల్లలు ముందుకు వచ్చారు. అది కూడా షరతులతో...! తల్లి తమ పిల్లల బాధ్యతలు తీసుకుంటేనే ఆమెను పోషిస్తామన్నారు. తండ్రి తన పెన్షన్ నుంచి సగం అద్దె, కరెంట్ బిల్లు చెల్లిస్తేనే చూస్తామని స్పష్టం చేశారు. దీంతో సుదీర్ఘ కాలం దేశం కోసం సరిహద్దుల్లో పోరాడిన తన ధైర్యాన్నే ఆదమ్ షఫీ నమ్ముకున్నారు. నయవంచుకులైన కొడుకుల పంచన ఉండే కంటే వేరేపని చేసుకుని ఉండడమే మేలనుకున్నాడు. దీంతో 5 నెలల క్రితం వారి నుంచి బయటకు వచ్చి, కూరగాయల బండితో కొత్త జీవితం ప్రారంభించాడు. అయితే పెరిగిన జీవన వ్యయం నేపథ్యంలో అది సరిపోక, భవన వ్యర్థాలను వేరు చేసే పనిలో కుదురుకున్నాడు. పగలు పని ముగిసిన తరువాత రాత్రి పూట దగ్గర్లోని గుడిలో నిద్రిస్తున్నాడు. తన రక్తం పంచుకుని పుట్టిన పిల్లలు, తన మనసు పంచుకోలేదని కుమిలిపోతున్నాడు. 

More Telugu News