: ఓ కాలు లేకున్నా పాక్ పై క్రికెట్ ఆడే తీరుతానన్న ధోనీ... గుర్తు చేసి పొగడ్తలు గుప్పించిన ఎమ్మెస్కే!

సరిగ్గా రెండు వారాల క్రితం భారత్, శ్రీలంక దేశాల మధ్య జరిగే వన్డే సిరీస్ కు టీమ్ ను ఎంపిక చేస్తున్న వేళ, చీఫ్ సెలక్టర్ ఎమ్మెస్కే ప్రసాద్ మాట్లాడుతూ, మహేంద్ర సింగ్ ధోనీ భారత క్రికెట్ జట్టులో 'ఆటోమేటిక్ చాయిస్' ఏమీ కాదు అని వ్యాఖ్యానించి విమర్శల పాలైన సంగతి తెలిసిందే. కట్ చేస్తే... ఇప్పుడాయన అభిప్రాయం పూర్తిగా మారిపోయింది.

లంకతో రెండు, మూడు వన్డే మ్యాచ్ లలో ఇండియా విజయం సాధించడానికి ధోనీ బ్యాటింగ్ ఎంతగా సహకరించిందో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. ఇక నిన్నటి మ్యాచ్ తరువాత ప్రసాద్ స్పందిస్తూ, ధోనీని పొగడ్తలతో ముంచెత్తాడు. ఆసియా కప్ లో పాకిస్థాన్ తో జరిగిన మ్యాచ్ ముందు జరిగిన ఓ ఘటనను గుర్తు చేసుకున్నాడు. ఆ సమయంలో ధోనీ వెన్నునొప్పితో బాధపడుతున్నాడని, అదే విషయాన్ని తాను ప్రస్తావించగా, తనకు ఓ కాలు విరిగినా పాక్ తో మ్యాచ్ ఆడి తీరుతానని ధోనీ స్పష్టం చేశాడని, అతని నిబద్ధత తనకెంతో నచ్చిందని చెప్పాడు.

More Telugu News