: ఊబెర్ కొత్త సీఈఓ.. దారా కోస్రోషాహి

అంత‌ర్జాతీయ క్యాబ్ స‌ర్వీస్ సంస్థ ఊబెర్ కొత్త సీఈఓగా దారా కోస్రోషాహి బాధ్య‌త‌లు చేప‌ట్టారు. ప్ర‌ముఖ‌ ట్రావెల్ కంపెనీ ఎక్స్‌పెడియా సీఈఓగా ప‌నిచేస్తున్న దారా చేతికి ఊబెర్ ప‌గ్గాలు అందించారు. గ‌త రెండు రోజుల వ‌ర‌కు హెచ్‌పీ ఎంట‌ర్‌ప్రైజెస్ సీఈఓ మెగ్ విట్‌మ‌న్ గానీ, జీఈ కంపెనీ చైర్మ‌న్ జెఫ్ ఇమ్మెలెట్ గానీ ఊబెర్ సీఈఓగా ఎంపిక‌య్యే అవ‌కాశం ఉన్న‌ట్లు వార్త‌లు వ‌చ్చాయి. కానీ అనూహ్యంగా దారా కోస్రోషాహిని ఎంచుకోవ‌డం గ‌మ‌నార్హం.

ప‌ర్షియ‌న్ - అమెరిక‌న్ అయిన దాదా 2005 నుంచి ఎక్స్‌పెడియా కంపెనీ ప‌గ్గాలు చేప‌డుతున్నారు. 60 దేశాల్లో ఈ కంపెనీ మంచి లాభాల‌ను చ‌విచూస్తోంది. అలాగే డొనాల్డ్ ట్రంప్ భావ‌జాలానికి కూడా కోస్రోషాహి వ్య‌తిరేకం. ప్ర‌స్తుతం స్వ‌ల్ప సంక్షోభ ప‌రిస్థితుల్లో కొట్టుమిట్టాడుతున్న ఊబెర్‌ను గాడిలో పెట్ట‌డం దారాకు ఛాలెంజ్ లాంటిదేన‌ని నిపుణులు అభిప్రాయ‌ప‌డుతున్నారు. స‌హ‌-వ్య‌వ‌స్థాప‌కుడు ట్రావిస్ క‌లానిక్ సృష్టించిన స‌మ‌స్య‌ల నుంచి ఊబెర్‌ను బ‌య‌ట‌కు తీసుకురావ‌డం దారా వ‌ల్లే అవుతుంద‌ని కంపెనీ బోర్డు అత‌న్ని ఎంచుకున్న‌ట్లు తెలుస్తోంది.

More Telugu News