: ‘యుద్ధం శరణం’ ఆడియో విడుదల...ఆ డైలాగ్ బాగా నచ్చిందన్న రాజమౌళి!

మారిమత్తు దర్శకత్వంలో నాగ చైతన్య-లావణ్య త్రిపాఠి జంటగా రూపొందించిన‘యుద్ధం శరణం’ చిత్రం ఆడియో వేడుక హైదరాబాద్ లో నిన్న రాత్రి ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ప్రముఖ దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి, సంగీత దర్శకుడు కీరవాణి తదితరులు పాల్గొన్నారు. సీడీలను కీరవాణి ఆవిష్కరించగా, తొలిసీడీని రాజమౌళి స్వీకరించారు. అంతకుముందు, రాజమౌళి మాట్లాడుతూ, తన భార్యకు ఏ కథా తొందరగా నచ్చదని, తన సినిమాలన్నింటినీ విమర్శిస్తుంటుందని, అలాంటిది, ఆమెకు ‘యుద్ధం శరణం’ చిత్రం కథ బాగా నచ్చిందని చెప్పారు. ఈ చిత్రం మంచి విజయం సాధిస్తుందని అప్పుడే తాను అనుకున్నానని అన్నారు.

ఈ చిత్రంలో విలన్ పాత్రలో నటించిన నటుడు శ్రీకాంత్ గెటప్ బాగుందని కితాబిచ్చిన రాజమౌళి, ఈ సినిమాలోని ‘పరిగెడుతున్న ప్రతి ఒక్కడూ పారిపోతున్నట్టు కాదు’ అనే డైలాగ్ తనకు బాగా నచ్చిందని అన్నారు. ఆ తర్వాత కీరవాణి మాట్లాడుతూ, వైవిధ్యమైన కథల్ని నాగచైతన్య ఎంచుకుని ముందుకు వెళ్తున్నాడని, ఈ పద్ధతి తనకు బాగా నచ్చిందని అన్నారు. హీరో నాగ చైతన్య మాట్లాడుతూ, దాదాపు ఈ సినిమాలో అందరూ కొత్తవాళ్లే పనిచేశారని, కొత్తవాళ్లతో పని చేసేందుకు ఏ నిర్మాత ముందుకు రారని, అలాంటిది నిర్మాత సాయి కొర్రపాటి  ముందుకు వచ్చి కొత్త తరాన్ని ప్రోత్సహిస్తుంటారని, ఆయన వల్లే ఈ సినిమా సాధ్యమైందని అన్నాడు. దర్శకుడు కృష్ణ, తాను మంచి స్నేహితులమని, సెప్టెంబరు 8న విడుదల కానున్న ఈ చిత్రం మంచి విజయం సాధించాలని కోరుకున్నాడు. 

More Telugu News