: చంద్రబాబుకు ఓటేస్తే మురిగిపోయినట్టే... అంటూ ఎలాగో చెప్పిన జగన్!

కాకినాడకు జరిగే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి ఓటు వేస్తే మురిగిపోయినట్టేనని, ప్రతి ఒక్కరూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి గెలిపించాలని ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్ ఓటర్లను కోరారు. ఈ ఉదయం నగర వీధుల్లో ర్యాలీ నిర్వహిస్తున్న ఆయన, ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తూ, మరో ఏడాదిలో లేదా ఏడాదిన్నరలోపే అసెంబ్లీ ఎన్నికలు వస్తాయని చంద్రబాబు స్వయంగా నంద్యాలలో చెప్పిన విషయాన్ని జగన్ గుర్తు చేశారు.

ఇప్పుడు ఓటు వేసి వైకాపాను గెలిపిస్తే, ఏడాది తరువాత, రాష్ట్రంలోనూ, ఇక్కడా వైకాపాయే ఉంటుందని, కాకినాడలో అభివృద్ధి అంటే ఏమిటో తాను చేసి చూపిస్తానని చెప్పారు. ఎన్నికల్లో ఓట్ల కోసం మాత్రమే చంద్రబాబు అభివృద్ధి మాటలు చెపుతున్నారని విమర్శించిన జగన్, నంద్యాలకు ప్రకటించినట్టుగానే, మిగతా అన్ని అసెంబ్లీలకూ ఎందుకు నిధులు ఇస్తున్నట్టు చెప్పలేదని ప్రశ్నించారు. మూడున్నరేళ్ల చంద్రబాబు పరిపాలనను ప్రజలంతా గమనిస్తూనే వచ్చారని, ఎన్నికలకు ముందు ఆయన చెప్పిన ఏ ఒక్క హామీ కూడా అమలు కాలేదని ఆరోపించారు. కాగా, కాకినాడ నగర పాలక సంస్థకు జరిగే ఎన్నికలకు సంబంధించిన ప్రచారపర్వం నేటి సాయంత్రం 5 గంటలతో ముగియనున్న సంగతి తెలిసిందే. 

More Telugu News