: మరిన్ని డోక్లాం వంటి సమస్యలు ముందున్నాయి: ఆర్మీ చీఫ్ కీలక వ్యాఖ్య

సరిహద్దుల్లో ఉద్రిక్తతలను మరింతగా పెంచడమే లక్ష్యంగా చైనా ప్రభుత్వం కొత్త ఎత్తులు వేస్తోందని, డోక్లాం తరహా పరిస్థితిని మరిన్ని ప్రాంతాల్లో కల్పించాలన్న ఉద్దేశంతో సైన్యాలను బార్డర్ లోకి పంపుతోందని ఆర్మీ చీఫ్ బిపిన్ రావత్ కీలక వ్యాఖ్యాలు చేశారు. భవిష్యత్తులో ఇరు దేశాల మధ్యా డోక్లాం పీఠభూమిలో ఏర్పడినటువంటి సమస్యలు రానున్నాయని తాను భావిస్తున్నట్టు ఆయన అన్నారు. వాస్తవాధీన రేఖ వెంటబడి చైనా సైన్యం మోహరించివుందని గుర్తు చేసిన ఆయన, వెంటనే తన సైన్యాన్ని చైనా వెనక్కు తీసుకోవాలని, సమస్యలను పరిష్కరించుకునే దిశగా చర్చలు ప్రారంభించేందుకు ఇండియా సిద్ధంగా ఉందని అన్నారు.

రెండు దేశాల సైన్యమూ వెనక్కు తగ్గేందుకు సిద్ధంగా లేదని చెప్పిన ఆయన, సరిహద్దుల్లో మోహరించిన జవాన్లు ఎదుటి దేశపు సైన్యాన్ని తప్పుగా అర్థం చేసుకుంటున్న పరిస్థితి నెలకొని ఉందని అన్నారు. దేశ రక్షణ విభాగం, స్ట్రాటజిక్ స్టడీస్ ఆఫ్ సావిత్రీ బాయ్ పూలే పుణె వర్శిటీ ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన పాల్గొని ప్రసంగించారు. ఇరు దేశాల సైన్యాలూ ఒకేసారి వెనక్కు వెళ్లాలన్నదే తమ అభిమతమని రావత్ వ్యాఖ్యానించారు.

More Telugu News