: హైదరాబాద్ లో డ్రంకెన్ డ్రైవ్ లను తప్పించుకునేందుకు మందుబాబుల కొత్త ప్లాన్!

మద్యం సేవించి వాహనాలు నడపవద్దని ఎంతగా ప్రచారం జరుగుతున్నా మందుబాబుల దూకుడు మాత్రం ఆగడం లేదు. ఈ క్రమంలో మందుబాబులు ఓ కొత్త మార్గం కనిపెట్టారు. తాము మందు కొట్టి డ్రైవింగ్ చేస్తూ వెళ్లే సమయంలో ముందు ఎక్కడైనా పోలీసుల చెకింగ్ కనిపిస్తే, ఆ సమయంలో వాహనాన్ని రోడ్డు పక్కన నిలబెట్టి కనిపించకుండా మాయం అవుతున్నారు. గత రాత్రి హైదరాబాద్ పరిధిలోని జూబ్లీహిల్స్ లో డ్రంకెన్ డ్రైవ్ నిర్వహించగా, 14 మంది పట్టుబడ్డారు. పట్టుబడిన వారికన్నా తప్పించుకున్న వారి సంఖ్య అధికంగా ఉండటం గమనార్హం.

 తనిఖీలు ముగిసిన తరువాత రోడ్డు పక్క పలు కార్లు, ద్విచక్ర వాహనాలు పోలీసుల కంటబడ్డాయి. మందుబాబులు వీటిని రోడ్డు పక్కన వదిలేసి వెళ్లారన్న అంచనాతో పోలీసులు వాటిని కూడా స్టేషన్ కు తరలించారు. ఇక తెల్లారాక స్టేషన్ కి వచ్చిన ఆయా కార్ల యజమానులు, కారులో ఏదో సాంకేతిక సమస్య ఏర్పడిందని, అందుకే అక్కడ వదిలేసి వెళ్లామని వంకలు చెప్పారు. డ్రంకెన్ డ్రైవ్ లో దొరక్కుండా తమ వాహనాలను తీసుకుపోయే ఉద్దేశంతోనే ఈ పని చేశారని తెలుస్తోంది. కొన్ని వాహనాలకు వాటి యజమానులే పంక్చర్ చేసి మరీ వెళ్లడం గమనార్హం.

More Telugu News