: టీడీపీవైపే మహేశ్ బాబు అభిమానులు: పేరు చెప్పకుండా కృష్ణ సోదరుడిపై గల్లా జయదేవ్ విమర్శలు

సూపర్ స్టార్ కృష్ణ, ప్రిన్స్ మహేశ్ బాబు అభిమానులు కాకినాడ నగరపాలక ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థుల విజయానికి కృషి చేయాలని గుంటూరు ఎంపీ, మహేశ్ బావ గల్లా జయదేవ్ అభ్యర్థించారు. నంద్యాల ఉప ఎన్నికలు మరికొన్ని రోజుల్లో జరుగుతాయనగా, కృష్ణ సోదరుడు ఘట్టమనేని ఆదిశేషగిరిరావు నంద్యాల మహేశ్ అభిమానులతో సమావేశమై, వైకాపాకు మద్దతు ప్రకటింపజేసిన విషయం తెలిసిందే.

ఈ నేపథ్యంలో ఆదిశేషగిరిరావు పేరును ప్రస్తావించకుండా, కొందరు కావాలనే మహేశ్, కృష్ణ అభిమానులు వైకాపావైపు ఉన్నారని తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆయన అన్నారు. తాను గుంటూరులో ఎంపీగా పోటీ చేసినప్పుడు ఘట్టమనేని అభిమానులంతా తనకు మద్దతు పలికినందునే గెలిచానని, ఇప్పుడు వారంతా టీడీపీవైపే ఉన్నారని అన్నారు. "మహేశ్ బాబు అనే వ్యక్తి... హీ ఈజ్ ఏ సూపర్ స్టార్. అయనకు పొలిటికల్ అఫిలియేషన్ లేదు. ఉండకూడదని కూడా ఆయన ఓ నిర్ణయం తీసుకున్నారు. సో... ఆయన పేరు అనవసరంగా పాలిటిక్స్ లోకి తెచ్చేది మంచిది కాదు. మహేశ్ బాబు, కృష్ణ ఫ్యాన్స్ ఎక్కువ మంది తెలుగుదేశానికే సపోర్ట్ చేస్తారు కానీ, వేరే పార్టీకి కాదు. జరుగుతున్న ప్రచారం అవాస్తవం" అని గల్లా జయదేవ్ అన్నారు. నీతి నిజాయతీ, అభివృద్ధి, సంక్షేమం కొనసాగాలంటే టీడీపీకే ఓటు వేయాలని అన్నారు.

More Telugu News