: 144 సెక్షన్లో స్పష్టతలేని కారణంగా డీసీపీని సస్పెండ్ చేసిన హర్యానా పోలీస్ శాఖ!
ఇద్దరు సాధ్వీలపై అత్యాచారం కేసులో బాబా గుర్మీత్ రామ్ రహీమ్ సింగ్ను పంచకుల సీబీఐ కోర్టు దోషిగా తేల్చడంతో పంజాబ్, హర్యానా ప్రాంతాల్లో ఆయన అనుచరులు హింసాకాండకు పాల్పడుతున్నారు. వారిని కట్టడి చేయడానికి ఆ ప్రాంత డీసీపీ అశోక్ కుమార్ పంచకుల ప్రాంతంలో 144 సెక్షన్ విధిస్తున్నట్లు ఆదేశాలు జారీచేశారు. అయితే ఆయన ఆదేశాల్లో స్పష్టత లేని కారణంగా హింసకాండ మరింత ఉద్రిక్తంగా మారింది.
నిజానికి 144 సెక్షన్ అమల్లో ఉన్నపుడు ఆయుధాలతో సంచరించినా, నలుగురైదుగురు గుమిగూడినా చర్యలు తీసుకోవాలి. కానీ అశోక్ కుమార్ ఆయుధాలతో కనిపిస్తే మాత్రమే చర్యలు తీసుకుంటామని ప్రకటించడం వల్ల ఆదేశాలు అస్పష్టంగా మారి, గొడవలు ఎక్కువయ్యాయి. దీనికి కారణం డీసీపీ అని భావించిన హర్యానా పోలీసు శాఖ అశోక్కుమార్ను సస్పెండ్ చేసింది. అక్కడ ఉద్రిక్త పరిస్థితులు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. ఈ హింసాకాండలో ఇప్పటికి 31 మంది చనిపోగా, 300 మందికి పైగా గాయపడినట్లు సమాచారం.