: జియో ఫోన్ బుక్ చేసుకుంటున్నారా? ఈ విషయాలు మీకు తెలుసా మరి?

ఎన్నాళ్లో వేచి చూసిన రోజు రానే వచ్చింది. గురువారం నుంచి జియో 4జీ ఫీచర్ ఫోన్ కోసం బుకింగ్స్ ప్రారంభమయ్యాయి. అయితే ఆన్‌లైన్లో బుక్ చేసుకోవాలనుకున్న లక్షలాదిమందికి నిరాశే మిగిలింది. బుకింగ్స్ ప్రారంభమైన నిమిషాల్లోనే జియో సైట్లు కుప్పకూలాయి. అయితే ఈ ఫోన్ బుక్ చేసుకునే ముందు అందరూ తప్పనిసరిగా తెలుసుకోవాల్సిన విషయాలు కొన్ని ఉన్నాయి. అవి..

ఒక వ్యక్తి ఒక ఫోన్‌ను బుక్ చేసుకోవడానికి మాత్రమే అర్హుడు. ఫోన్ బుక్ చేసుకోవడానికి ఆధార్ కార్డు తప్పనిసరి. అంటే ఆధార్ కార్డు లేనివారు ఫోన్‌ను బుక్ చేసుకోలేరు. బుకింగ్ సందర్భంగా ఆధార్ కార్డు జిరాక్స్ సమర్పించాల్సి ఉంటుంది. జియో ఫోన్లను బల్క్‌లో బుక్ చేసుకోవాలనుకునే వ్యాపారులు తమ కంపెనీ జీఎస్టీఎన్, పాన్ నంబర్లు తెలపాల్సి ఉంటుంది. ఆధార్‌తో అయితే ఒక ఫోన్ బుకింగ్ మాత్రమే పరిమితం. ప్రీ బుకింగ్ సందర్భంగా వినియోగదారులు తొలుత రూ.500 చెల్లించాల్సి ఉంటుంది. ఫోన్ డెలివరీ సమయంలో మిగతా రూ.1000 చెల్లించాలి. మొదట బుక్ చేసుకున్న వారికి మొదట ప్రాతిపదికన ఈ ఫోన్లను పంపిణీ చేస్తారు.

సెప్టెంబరు 1-4 మధ్యలో ఫోన్లు డెలివరీ అవుతాయి. ఫోన్ తీసుకున్న తర్వాత నెలకు రూ.153 చొప్పున రీచార్జ్ చేయించుకోవాల్సి ఉంటుంది. ఇందులో భాగంగా వినియోగదారులు అన్‌లిమిటెడ్ డేటా (రోజుకు 500 ఎంబీ ఎఫ్‌యూపీ యూనిట్), ఉచిత వాయిస్ కాల్స్, ఎస్సెమ్మెస్‌లు, జియో యాప్స్ వాడుకోవచ్చు. అలాగే రూ.23, రూ.53 సాచెట్ ప్యాకెట్లను కూడా ఆఫర్ చేస్తోంది. వీటి కాలపరిమితి వరుసగా రెండు రోజులు, వారం రోజులు. జియో ఫోన్ ఉచితమే అయినా సెక్యూరిటీ డిపాజిట్ కింద రూ.1500 చెల్లించాల్సి ఉంటుంది. మూడేళ్ల తర్వాత కంపెనీ ఈ సొమ్మును తిరిగి చెల్లిస్తుంది. రిఫండ్ కావాలంటే వినియోగదారులు కనీసం 90 రోజుల్లో ఒకసారైనా రీచార్జ్ చేయించుకోవాల్సి ఉంటుంది. యూజర్లు జియో టీవీ కేబుల్‌ను ఉపయోగించుకోవాలంటే అదనంగా రూ.309తో రీచార్జ్ చేయించుకోవాల్సి ఉంటుంది. ఇది రెగ్యులర్ రీచార్జ్‌కు అదనం.

More Telugu News