: ఏడుస్తున్న ఆ చిన్నారి బాలీవుడ్ సెలబ్రిటీ బంధువే... తప్పేంటంటూ విరాట్, యువరాజ్ తదితరులపై తీవ్ర విమర్శలు!

రెండు రోజుల క్రితం అంకెలు చెప్పేందుకు బాధపడుతూ ఏడుస్తున్న ఓ చిన్నారి వీడియోను టీమిండియా క్రికెట్ జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ, తన సోషల్ మీడియాలో పంచుకుంటూ, చిన్నారిని హింసిస్తున్నారని తీవ్ర విమర్శలు చేసిన సంగతి తెలిసిందే. ఆపై క్రికెటర్లు శిఖర్ ధావన్, యువరాజ్, రాబిన్ ఉతప్ప తదితరులతో పాటు ఎంతో మంది చిన్నపిల్లను అలా చేయడం తప్పని వ్యాఖ్యానించారు. ఇక ఆ పాప ఎవరో తెలిసిపోయింది. ఆమె బాలీవుడ్ సెలబ్రిటీ, సింగర్, సంగీత దర్శకుడు తోషీ మూడేళ్ల మేనకోడలు హయా.

'హిందుస్థాన్ టైమ్స్'కు ఇంటర్వ్యూ ఇచ్చిన తోషి, ఈ వీడియో చూపుతూ విమర్శించిన వారిపై విరుచుకుపడ్డాడు. "విరాట్ కోహ్లీ, ధావన్, యువరాజ్ లకు మా గురించి తెలియదు. మా పాప గురించి మాకు తెలుసు. హయా ఏం చేస్తుందో తెలుసు. అలా అనడం, ఏడుస్తూ చదవడం ఆమెకు అలవాటు. తరువాతి నిమిషంలోనే ఆటలకు వెళ్లిపోయింది. మేం ఒత్తిడి చేయకుంటే, ఆమె చదవదు" అని అన్నాడు. పిల్లలు చదువుకోవడం చాలా ముఖ్యమని, స్కూల్ లో అంకెలు నేర్చుకోవాలని ఇచ్చిన హోం వర్క్ ను తను పూర్తి చేసిందని చెప్పాడు. తల్లిదండ్రులు పిల్లలకు బోధించే విషయంలో ఒకటిన్నర నిమిషం వీడియో చూసి తీర్పెలా ఇస్తారని ప్రశ్నించాడు.

More Telugu News