: నెటిజన్లకు ఘాటు ట్వీట్లతో సమాధానం చెప్పిన హర్భజన్ సింగ్... ధోనీని అడగాలని సూచన

2011 ప్రపంచకప్‌ గెలిచిన భారత జట్టు ఆటగాళ్లకి ఆమ్రపాలి సంస్థ విల్లాలను కానుకగా అందజేస్తామని ప్రకటించిన సంగతి తెలిసిందే. ఆ తరువాతి కాలంలో ఆమ్రపాలి సంస్థకు మహేంద్ర సింగ్ ధోనీ బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరించాడు. అయితే విల్లాలు కొనుక్కున్న వాళ్లను ఆమ్రపాలి సంస్థ మోసం చేసిందన్న ఆరోపణల నేపథ్యంలో ఆ పదవి నుంచి ధోనీ తప్పుకున్నాడు. ఈ క్రమంలో సోషల్ మీడియాలో భజ్జీని ఉద్దేశిస్తూ ఒక నెటిజన్ ‘కోట్లాది రూపాయల విలువ గల విల్లాలను ఆమ్రపాలి సంస్థ ధోనీ, భజ్జీలకు కానుకలుగా అందజేసింది. అందువల్లే మా డబ్బులు మాకు రావడంలేదు’ అంటూ తీవ్ర ఆరోపణలు చేశాడు.

 దీంతో చిర్రెత్తుకొచ్చిన భజ్జీ అతనికి సమాధానమిస్తూ, ‘మేము విల్లాలు అందుకున్నట్లు మీకు ఎవరు చెప్పారు? అలాంటివి ఏమీ మాకు అందలేదు. మా పేర్లు వాడుకుని ప్రజల నుంచి పలువురు సొమ్ములు చేసుకుంటున్నారు’ అని స్పష్టం చేశాడు. దానికి మరో నెటిజన్ ‘ఆమ్రపాలి సంస్థ యజమానికి ధోనీ మంచి స్నేహితుడు. అందుకే హర్భజన్‌ సింగ్‌ ఆబద్ధాలు చెప్తున్నాడు’ అంటూ ట్వీట్ చేశాడు. అతనికి భజ్జీ సమాధానమిస్తూ, ‘ఆమ్రపాలి సంస్థ యజమాని నాకు స్నేహితుడు కాదు కదా. ధోనీకి కదా. కాబట్టి ధోనీని అడగడం న్యాయం. ఏమాత్రం బుర్ర ఉన్నా అదే చెయ్యి’ అంటూ భజ్జీ కాస్తంత ఘాటుగా సమాధానం ఇచ్చాడు.

More Telugu News