: యూసీ బ్రౌజర్‌పై కేంద్రం నిఘా.. సమాచారాన్ని చైనాకు పంపుతోందని అనుమానం!

చైనాకు చెందిన మొబైల్ యాప్ యూసీ బ్రౌజర్‌పై కేంద్రం నిఘా పెట్టింది. వినియోగదారుల వ్యక్తిగత సమాచారాన్ని, లొకేషన్‌ను ఇది చైనాలోని సర్వర్‌కు పంపుతోందన్న అనుమానంతో దానిపై ఓ కన్నేసింది. ఈ ఆరోపణలపై ప్రభుత్వ ల్యాబ్ ఒకటి విచారణ జరుపుతుండడంతోపాటు, కొన్ని మొబైల్ సంస్థలకు నోటీసులు కూడా జారీ చేయనున్నట్టు తెలుస్తోంది. చైనాకు చెందిన ఈ-కామర్స్ దిగ్గజం అలీబాబాకు చెందిన ఈ బ్రౌజర్ వినియోగదారుల వ్యక్తిగత సమాచారంతోపాటు ఐఎంఐఏ, ఐఎంఈఐ నంబర్లను కూడా చైనాకు పంపిస్తున్నట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి.

వై-ఫైకి కనెక్ట్ అయినప్పుడు వినియోగదారుడి పూర్తి వివరాలు చైనాకు చేరిపోతున్నట్టు ఓ జాతీయ పత్రిక తన కథనంలో పేర్కొంది. యూసీ బ్రౌజర్ ఈ అనైతిక కార్యక్రమాలకు పాల్పడినట్టు తేలితే కేంద్రం కఠిన చర్యలు తీసుకునే అవకాశం ఉంది. దేశంలోని మొబైల్ వినియోగదారుల్లో దాదాపు సగం మంది యూజర్లు ఈ యూసీ బ్రౌజర్‌ను ఉపయోగిస్తున్నారు. కేంద్రం ఇప్పటికే రిలయన్స్ జియోకు చెందిన లైఫ్ బ్రాండ్ మొబైల్ ఫోన్లతోపాటు వీడియోకాన్, మైజు కంపెనీలకు నోటీసులిచ్చింది. ఇప్పుడు  మరిన్ని కంపెనీలకు నోటీసులు ఇచ్చేందుకు సిద్ధమవుతోంది.

More Telugu News