: బీజేపీ కేంద్ర కార్యాలయంలో నేటి సాయంత్రం కీలక సమావేశం... మోదీ, షా, బీజేపీ సీఎంలు హాజరు

2019 సార్వత్రిక ఎన్నికలకు ముందు బీజేపీ నేడు కీలక సమావేశాన్ని నిర్వహిస్తోంది. ఢిల్లీలోని బీజేపీ కేంద్ర కార్యాలయంలో ఈ రోజు సాయంత్రం 6 గంటలకు ఈ భేటీ జరగనుంది. ప్రధాని నరేంద్రమోదీ, బీజేపీ సారధి అమిత్ షా, బీజేపీ అధికారంలో ఉన్న 13 రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ఆరుగురు డిప్యూటీ ముఖ్యమంత్రులు, కేబినెట్ మంత్రులు ఈ సమావేశంలో పాల్గొంటారు. 2014 సార్వత్రిక ఎన్నికల అనంతరం బీజేపీ సీఎంలతో మోదీ సమావేశం కానుండడం ఇది మూడోసారి.

ఈ సమావేశంలో తమ రాష్ట్రాల్లో అమలు చేస్తున్న వివిధ పథకాల సమాచారాన్ని ముఖ్యమంత్రులు వివరించనున్నారు. 2019 ఎన్నికలు, అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలపై చర్చ జరగనుంది. '2019 ఎన్నికలు' అంశం అత్యంత కీలకమైనది కానుంది. ఎందుకంటే, మరోసారి బీజేపీని కేంద్రంలో అధికారంలో కూర్చోబెట్టేందుకు వీలుగా అమిత్ షా ఇప్పటికే ఓ బ్లూప్రింట్ ను సిద్ధం చేశారు. దానిపై సమాలోచనలు జరగనున్నాయి. గత ఎన్నికల్లో బీజేపీ ఓటమి పాలైన 120 సీట్లపై ప్రత్యేకంగా దృష్టి సారించడంతోపాటు 2019 సార్వత్రిక ఎన్నికల్లో కనీసం 350 లోక్ సభ సీట్లను గెలవాలన్నది వ్యూహం.  

More Telugu News