: మోసాల‌ను అరిక‌ట్ట‌డానికి పాత డెబిట్ కార్డులను ప్ర‌క్షాళ‌న చేయ‌నున్న ఎస్‌బీఐ!

డెబిట్ కార్డుల స‌హాయంతో జ‌రుగుతున్న మోసాల‌ను అరిక‌ట్ట‌డానికి కొంత‌మంది ఖాతాదారుల డెబిట్ కార్డులను ప్రక్షాళ‌న చేసేందుకు ఎస్‌బీఐ య‌త్నిస్తోంది. ఈ నేప‌థ్యంలో వినియోగ‌దారుల డెబిట్ కార్డుల‌ను శాశ్వ‌తంగా బ్లాక్ చేయ‌నున్న‌ట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించిన సమాచారాన్ని ఖాతాదారుల‌కు పంపించింది. కార్డులను బ్లాక్ చేయాల్సివ‌చ్చిన కార‌ణాల‌ను ఎస్‌బీఐ వెబ్‌సైట్‌లో ప్రకటించింది.

ఆర్‌బీఐ ఆదేశాల మేర‌కు భద్రతా కారణాల వ‌ల్ల మేగ్న‌టిక్ స్ట్రిప్ డెబిట్ కార్డులను, ఈవీఎం చిప్ డెబిట్ కార్డులతో భర్తీ చేసేందుకే ఈ ప్ర‌య‌త్న‌మ‌ని పేర్కొంది. 2017 సెప్టెంబర్ 30లోగా అన్ని బ్యాంకులు, వైట్ లేబుల్ ఏటీఎం ఆపరేటర్లు చిప్ ఆధారిత ఏటీఎం మోడల్స్‌లోకి మారాల‌ని ఆర్‌బీఐ ఆదేశించిన సంగ‌తి తెలిసిందే. బ్లాకైన కార్డ‌ల‌ను మార్చుకోవడానికి ఖాతాదారులు బ్యాంకును సంప్ర‌దించాల‌ని కోరింది. ఆన్‌లైన్ ద్వారా కూడా కార్డులు మార్చుకునే సౌక‌ర్యాన్ని ఎస్‌బీఐ క‌ల్పించింది. ఈవీఎం చిప్ డెబిట్ కార్డులను బ్యాంకు ఉచితంగా అందించనుంది.

More Telugu News