: మీరంతా నా వెంటేనని తెలుసు... ఎవరినీ వదులుకోబోను: చంద్రబాబు

నంద్యాల ఉప ఎన్నికల మలివిడత ప్రచారంలో బిజీగా ఉన్న ఏపీ సీఎం చంద్రబాబు ఈ ఉదయం ముస్లింలతో ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ముస్లింల సమస్యలను గురించి అడిగి తెలుసుకున్న ఆయన, మైనారిటీల్లో పేదరికాన్ని పారద్రోలేందుకు తాను కృత నిశ్చయంతో ఉన్నానని తెలిపారు. నియోజకవర్గంలోని ముస్లింలంతా తన వెంటే ఉన్నారన్న విషయం తనకు తెలుసునని, ప్రతి ఒక్క సమస్యనూ పరిష్కరిస్తానని, ఏ వర్గాన్నీ వదులుకోబోనని ఈ సందర్భంగా చంద్రబాబు వ్యాఖ్యానించారు.

తవ్వేకొద్దీ వైకాపా నేతల అక్రమాలు వెలుగు చూస్తున్నాయని, శిల్పా కుటుంబం ఓ సహకార సంఘం పెట్టి ఇబ్బందులు కలిగిస్తోందని తనకు ఇటీవలే తెలిసిందని, దానిపై విచారణ జరిపిస్తానని అన్నారు. అనుమతి లేకుండా సంఘాలు ఏర్పాటు చేసి ప్రజలను మోసం చేయాలని చూస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. శిల్పా కుటుంబీకులు ఏర్పాటు చేసిన సంఘం పేదలకు అప్పులిచ్చి, అధిక వడ్డీలను గుంజుతూ మోసాలకు, అక్రమాలకు పాల్పడుతోందని ఆరోపించారు. అభివృద్ధి చేసేవారికే ప్రజలు మద్దతిస్తారని, ఈ ఎన్నికల్లో గెలిచేది భూమా బ్రహ్మానందరెడ్డేనని అన్నారు. ఈ సందర్భంగా ఓ ఎమ్మెల్యేపై కొంతమంది ఫిర్యాదు చేయగా, తాను పరిశీలిస్తానని వారికి హామీ ఇచ్చారు.

More Telugu News