: సంప్రదాయాన్ని బద్దలు గొట్టేందుకు సిద్ధమైన కేటీఆర్.. అమావాస్య రోజు బాలానగర్ ఫ్లై ఓవర్‌కు శంకుస్థాపన!

తెలంగాణ మంత్రి కేటీఆర్ సంప్రదాయాన్ని బద్దలు గొట్టేందుకు రెడీ అవుతున్నారు. అమావాస్య రోజు శంకుస్థాపనకు సిద్ధమవుతున్నారు. హైదరాబాద్ శివారు బాలానగర్-నర్సాపూర్  క్రాస్‌రోడ్ వద్ద ఫ్లై ఓవర్ నిర్మాణానికి సోమవారం (21న) శంకుస్థాపన చేయనున్నారు. ఆరోజు అమావాస్య కావడం గమనార్హం. నిజానికి అమావాస్య రోజు శుభకార్యాలు చేయడానికి చాలామంది వెనకాడతారు.

అంతేకాదు.. అదే రోజు సూర్యగ్రహణం కూడా కావడంతో చాలామంది ఆరోజు బయటకు వచ్చేందుకే జంకుతారు. అటువంటిది సెంటిమెంట్‌ను పక్కనపెట్టిన మంత్రి ఏకంగా ఫ్లై ఓవర్ శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొంటుండడం ఆసక్తి కలిగిస్తోంది. ఈ బ్రిడ్జి నిర్మాణం కనుక పూర్తయితే వాహనదారులకు బోల్డంత వెసులుబాటు లభిస్తుంది. సికింద్రాబాద్, బోయిన్‌ప్లలి, బాలానగర్, సనత్‌నగర్, కూకట్‌పల్లి, చింతల్, జీడిమెట్ల వెళ్లే ప్రయాణికులకు అవస్థలు తగ్గుతాయి.

More Telugu News