: బైక్ పై వెళుతూ... బస్సును ఓవర్టేక్ చేసే ప్రయత్నం... ఇద్దరి మృతి!
రహదారిపై అతివేగం, తొందరపాటు మరో ఇద్దరు వ్యక్తుల ప్రాణాలను తీసింది. బైక్పై వెళుతున్న ముగ్గురు వ్యక్తులు తమ ముందున్న బస్సును ఓవర్టేక్ చేయడానికి ప్రయత్నించారు. అయితే, ఆ ప్రయత్నంలో ఒక్కసారిగా లారీకి ఢీ కొన్నారు. దీంతో బైకుపై ప్రయాణిస్తోన్న వారిలో ఇద్దరు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మరో వ్యక్తికి తీవ్రగాయాలయ్యాయి. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు వివరాలు తెలిపారు.
కృష్ణాజిల్లా కంకిపాడు మండలం ఉప్పులూరులో ఈ రోజు మధ్యాహ్నం అదే గ్రామానికి చెందిన కుంచెపు భీమయ్య, లక్ష్మణరావు, ఉప్పు వీరాస్వామి బైక్పై హనుమాన్పేట వైపు వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుందని అన్నారు. ఈ ఘటనలో భీమయ్య, లక్ష్మణరావు ప్రాణాలు కోల్పోయారని, వీరాస్వామి గాయాలపాలై, ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడని తెలిపారు.