: దేశాన్ని గర్వపడేలా చేసిన మరుగుజ్జులు: విజయ్ గోయల్

కెనడాలోని టొరంటోలో జరిగిన ప్రపంచ మరుగుజ్జుల పోటీలో భారత టీమ్ అద్భుత రీతిలో రాణించి, ఒలింపిక్స్ సహా, మరే ప్రపంచ స్థాయి క్రీడల్లో భారత్ కు లభించని స్థానాన్ని సాధించింది. వీరు సాధించిన ఘనతపై క్రీడా శాఖ మంత్రి విజయ్ గోయల్ స్పందించారు. ఈ టీమ్ భారతావని గర్వపడేలా చేసిందని పేర్కొన్నారు. కాగా, 15 బంగారు పతకాలు, 10 రజత, 12 కాంస్య పతకాలు సహా 37 పతకాలను సాధించి టాప్ 10లో ఇండియా నిలిచిన సంగతి తెలిసిందే.

 ఒంటారియోలోని యూనివర్శిటీ ఆఫ్ గ్యూల్ఫ్ లో వరల్డ్ డ్వార్ఫ్ గేమ్స్ సాగగా, 24 దేశాల నుంచి 400 మందికి పైగా అథ్లెట్లు పాల్గొన్నారు. బ్యాడ్మింటన్, షాట్ పుట్, జావెలిన్, డిస్కస్ త్రో, వెయిట్ లిఫ్టింగ్ తదితర క్రీడాంశాల్లో పోటీ పడిన జాబీ మ్యాథ్యూ, రెండు గోల్డ్, మూడు సిల్వర్, ఒక బ్రాంజ్ మెడల్ గెలిచాడు. ఈ ఆటల్లో పాల్గొనేందుకు సరైన శిక్షణ లేకుండానే వచ్చిన వీరు ఏకంగా 37 పతకాలను గెలుచుకోవడం విశేషం.


More Telugu News