: నా బిడ్డను రప్పించండి: 16 ఏళ్ల కుమార్తెను 65 ఏళ్ల షేక్ కు ఇచ్చి పెళ్లి చేసిన తల్లి ఆవేదన!

ముక్కుపచ్చలారని తన బిడ్డను భర్త, మరదలు కలసి పండు ముసలి వ్యక్తికి ఇచ్చి పెళ్లి చేశారని, తన బిడ్డ ఇప్పుడు ఎన్నో కష్టాలు పడుతోందని, ఆమెను ఎలాగైనా తిరిగి తీసుకురావాలని పోలీసులను వేడుకుంటోందో తల్లి. హైదరాబాద్, ఫలక్ నుమా పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం, నవాబ్ సాహెబ్ కుంట ప్రాంతానికి చెందిన సయీదా ఉన్నీసా తన 16 ఏళ్ల కుమార్తెను మస్కట్ కు చెందిన 65 ఏళ్ల అహ్మద్ కు ఇచ్చి రంజాన్ ముందు వివాహం చేశారు. తన భర్త సికిందర్, మరదలు గౌసియాలు ఈ సంబంధాన్ని కుదిర్చారు.

ఈ పెళ్లి వద్దని ఉన్నీసా చెప్పినా వారు వినలేదు. "నా కుమార్తెను మస్కట్ షేక్ రూ. 5 లక్షలిచ్చి కొనుగోలు చేశాడట. ఆ డబ్బును నా భర్తకు ఇచ్చాడట. ఆ డబ్బును వెనక్కు ఇస్తేనే బిడ్డను పంపుతానని అంటున్నాడు.ఆమె ఇప్పుడు మస్కట్ లో బాధలు పడుతోంది. ఆమెను తిరిగి ఇండియాకు రప్పించండి" అని ఉన్నీసా వేడుకుంది. పెళ్లి తరువాత నాలుగు రోజుల పాటు ఓ హోటల్ లో తన కుమార్తెతో గడిపిన షేక్, ఆమెకు పాస్ పోర్టు, ఇతర డాక్యుమెంట్లను సృష్టించి తనతో పాటు తీసుకెళ్లాడు. ఆమె ఫిర్యాదుపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు, విచారణ జరుపుతున్నట్టు తెలిపారు.

More Telugu News