: 6 లక్షల ఖరీదైన బైక్ తో రేసింగ్... ప్రాణం తీసింది!

6 లక్షల రూపాయలతో విలాసవంతమైన బైక్‌ కొనిస్తే...ఆ బైక్ తో ప్రాణం తీసుకున్నాడో వ్యాపారి కుమారుడు. ఢిల్లీలో చోటుచేసుకున్న ఘటన వివరాల్లోకి వెళ్తే...ఢిల్లీలో ప్రముఖ వ్యాపారవేత్త వివేక్‌ విహార్‌ కుమారుడు హిమాన్షు బన్సల్‌ (24) కు ఖరీదైన బైక్ ను కొనిచ్చారు. ఆ బైక్ గంటకు 200 కిలోమీటర్ల వేగంతో దూసుకుపోగల సామర్థ్యం కలిగి ఉంది. ఈ బైక్ వేసుకుని హిమాన్షు ఒక పార్టీలో స్నేహితులతో కలిసి పాల్గొన్నాడు.

అనంతరం తన ఇద్దరు స్నేహితులతో కన్నాట్ ప్రాంతం నుంచి దక్షిణఢిల్లీకి వెళ్లే మార్గంలో బైక్ రేసింగ్ లో పాల్గొన్నాడు. ముందున్న వాహనాలను దాటుకుంటూ దూసుకుపోయాడు. సుమారు 200 కిలోమీటర్ల వేగంతో దూసుకెళ్తుండగా వేగాన్ని నియంత్రించలేక రోడ్డు దాటుతున్న పాదచారిని ఢీ కొట్టాడు. దీంతో పాదచారి ఒకవైపు ఎగిరిపడిపోగా, హిమాన్షు వాహనం డివైడర్ కు ఢీ కొట్టి రోడ్డుపై పడిపోయింది. సమాచారం అందుకున్న పోలీసులు క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రికి చేర్చేసరికే హిమన్షు ప్రాణం కోల్పోయి తల్లిదండ్రులకు కడుపుకోత మిగిల్చాడు. ఈ యాక్సిడెంట్ కు సంబంధించిన దృశ్యాలు హిమాన్షు స్నేహితుడు హెల్మెట్ కెమెరాలో నిక్షిప్తమయ్యాయి. 

More Telugu News