: ఈ రోజు కుమారుడి పెళ్లి... కానీ, నిన్న రాత్రంతా బోరుబావి వద్దే ఉన్న ఎమ్మెల్యే!

గుంటూరు జిల్లా వినుకొండ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులుపై సర్వత్రా ప్రశంసలు కురుస్తున్నాయి. వివరాల్లోకి వెళ్తే, ఈ ఉదయం 8.30 గంటలకు గుంటూరులో ఆయన కుమారుడి వివాహం జరిగింది. ఈ నేపథ్యంలో నిన్నంతా పెళ్లికి సంబంధించిన పనులతో బిజీగా ఉన్నారు. అయితే, ఊహించని విధంగా ఉమ్మడివరంలో బోరుబావిలో చిన్నారి పడిపోయాడు. ఈ విషయం తెలియడంతో, ఆయన పెళ్లి పనులను సైతం పక్కన పెట్టి హుటాహుటిన ఘటనా స్థలికి చేరుకున్నారు.

బోరుబావి వద్దే మకాం వేసి ఉన్నతాధికారులను ఘటనా స్థలికి రప్పించి, వారి సహకారంతో బాలుడిని సురక్షితంగా బయటకు తెచ్చేందుకు ఆయన విశ్వప్రయత్నం చేశారు. చివరకు ఆ బాలుడిని సురక్షితంగా బోరుబావి నుంచి రాత్రి 2.45 గంటలకు బయటకు తీశారు. బాలుడుని అతని తల్లిదండ్రులకు అప్పగించిన తర్వాత ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు గుంటూరుకు వెళ్లారు. కుమారుడి పెళ్లిని సైతం లెక్కచేయకుండా, పిల్లాడి కోసం బోరుబావి వద్దే ఉండిపోయిన ఎమ్మెల్యే చొరవను పలువురు అభినందిస్తున్నారు.  

More Telugu News