: నీతికి-అవినీతికి, న్యాయానికి-అన్యాయానికి మధ్య జరుగుతున్న పోరాటం ఇది.. వైసీపీకి బుద్ధి చెప్పండి: నంద్యాల రోడ్ షోలో బాలయ్య ఫైర్

నంద్యాల ఉపఎన్నిక ప్రచారంపర్వంలోకి ప్రముఖ సినీ నటుడు నందమూరి బాలకృష్ణ దూకారు. ఈ రోజు ఆయన నంద్యాల నియోజకవర్గంలో రోడ్ షో నిర్వహించారు. భారీ ఎత్తున వాహనాల్లో కార్యకర్తలు అనుసరించగా ఆయన రోడ్ షో ముందుకు సాగింది. ప్రచార వాహనంపై బాలయ్యకు అటూ ఇటూ మంత్రి భూమా అఖిలప్రియ, టీడీపీ అభ్యర్థి భూమా బ్రహ్మానందరెడ్డి, భూమా రెండో కుమార్తె మౌనికలు ఉన్నారు.

ఈ సందర్భంగా వెంకటేశ్వరపురంలో బాలయ్య మాట్లాడుతూ, ప్రజా సంక్షేమం కోసం ఎంతగానో పాటుబడుతున్న టీడీపీని అఖండ మెజార్టీతో గెలిపించాలని ఓటర్లను కోరారు. అన్ని వర్గాలవారికి టీడీపీ న్యాయం చేస్తోందని చెప్పారు. అన్ని విధాలా రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తున్నామని... అభివృద్ధిని అడ్డుకుంటున్నవారికి బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. నీతికి-అవినీతికి, న్యాయానికి-అన్యాయానికి మధ్య జరుగుతున్న పోరాటమే నంద్యాల ఉపఎన్నిక అని చెప్పారు. ఓటు తూటాతో వైసీపీకి బుద్ధి చెప్పాలని కోరారు. కేవలం స్వార్థం కోసమే శిల్పా మోహన్ రెడ్డి, శిల్పా చక్రపాణిరెడ్డిలు వైసీపీలో చేరారని విమర్శించారు. తాను కేవలం నటుడిని మాత్రమే కాదని... ప్రజా సేవకుడిని కూడా అని చెప్పారు. రోడ్ షో సందర్బంగా బాలయ్యకు అభిమానులు ఘన స్వాగతం పలికారు. వెంకటేశ్వరపురం నుంచి నంద్యాల టౌన్, గోస్పాడు, నంద్యాల రూరల్ ప్రాంతాల్లో బాలయ్య ప్రచారం కొనసాగనుంది. 

More Telugu News