: వొడాఫోన్‌కు చెమటలు పట్టిస్తున్న జియో ఉచిత ఫోన్.. టెలికం విభాగానికి లేఖ!

రిలయన్స్ జియో నుంచి అతి త్వరలో రానున్న 4జీ ఫీచర్‌ను చూసి మరో టెలికం సంస్థ వొడాఫోన్ వణుకుతోంది. అది కనుక వినియోగదారులకు అందుబాటులోకి వస్తే ఇక తమ పని అయిపోయినట్టేనని ఆందోళన వ్యక్తం చేస్తూ టెలికం విభాగానికి లేఖ రాసింది. జియో ఉచితంగా ఇవ్వనున్న ఈ ఫోన్ వల్ల ఇప్పటికే నష్టాల ఊబిలో కూరుకుపోయిన తాము మరిన్ని కష్టాల్లో పడిపోయే అవకాశం ఉందని ఆవేదన వ్యక్తం చేసింది. తమ ఆదాయంపై ఈ ఫోన్ తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉందని పేర్కొంటూ టెలికం కమిషన్ మెంబర్ అనురాధ మిశ్రాకు లేఖ రాసింది. అపరిమిత కాల్స్‌తో వస్తున్న జియో 4జీ ఫీచర్ ఫోన్ వల్ల తమ కంపెనీ లాభాలకు గండిపడుతుందంటూ అందులో పేర్కొంది.

కాగా, రిలయన్స్ జియో ముందుగా ప్రకటించినట్టే ఆగస్టు 15న ఈ ఫోన్‌ను బీటా టెస్టింగ్ కోసం విడుదల చేసింది. ఈనెల 24 నుంచి వినియోగదారుల కోసం బుకింగ్స్ ప్రారంభం కానుండగా వచ్చేనెల 1-4 మధ్యలో ఫోన్ వినియోగదారులకు అందనుంది. డెలివరీ సమయంలో సెక్యూరిటీ డిపాజిట్ రూ.1500 అందించాల్సి ఉంటుంది.

More Telugu News