: అత్యాచారమంటే శరీరాన్నే కాదు... ఆత్మను నాశనం చేయడమే!: మరదలిని రేప్ చేసిన బావ కేసులో ఢిల్లీ కోర్టు

ఓ బావ తన సొంత మరదలిపై అత్యాచారానికి పాల్పడిన కేసు విచారణ సందర్భంగా ఢిల్లీ సెషన్స్ కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. అత్యాచారం అంటే కేవలం శరీరానికి సంబంధించిన విషయం కాదని, ఓ నిస్సహాయురాలైన మహిళ ఆత్మను నాశనం చేయడమేనని పేర్కొంది. 2016 మార్చి 26న జరిగిన ఈ అత్యాచార ఘటనను విచారించిన న్యాయమూర్తి సంజీవ్ జైన్ తన తీర్పును వెలువరిస్తూ, ఇది కేవలం శరీరంపై దాడి కాదని, బాధితురాలి వ్యక్తిత్వాన్ని, ఆత్మనూ చెరచడమేనని వ్యాఖ్యానించారు.

నిందితుడికి ఏడేళ్ల కఠిన కారాగార శిక్షతో పాటు రూ. 20 వేల జరిమానాను విధించారు. తనను అన్యాయంగా ఇరికించారన్న నిందితుడి వాదనను కొట్టి పారేసిన న్యాయమూర్తి, సంప్రదాయ సమాజంలోని ఏ యువతి కూడా తాను అత్యాచారానికి గురయ్యానన్న తప్పుడు ఫిర్యాదులు ఇవ్వబోదని వ్యాఖ్యానించారు. కాగా, ఢిల్లీలోని ఓ కాలనీలో ఉంటున్న తన సోదరి ఇంటికి వెళ్లిన నిందితుడు, ఆ సమయంలో అక్కడే ఉన్న తన మరదలిపై అత్యాచారం చేశాడు. ఆపై మరోసారి అదే ప్రయత్నం చేయడంతో ఆమె ఫిర్యాదు చేయగా, కేసు కోర్టుకు వచ్చింది.

More Telugu News