: చంద్రబాబు నాయుడు ఎన్నికల ముందే నిద్రలేస్తారు: జగన్
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎన్నికల ముందే నిద్రలేస్తారని వైసీపీ అధినేత జగన్ ఎద్దేవా చేశారు. నంద్యాల ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈ రోజు గిరినాథ్ సెంటర్లో రోడ్ షో నిర్వహించిన జగన్ మాట్లాడుతూ.. చంద్రబాబు నాయుడు ఎన్నికల అనంతరం మళ్లీ ప్రజల గురించి పట్టించుకోరని అన్నారు. ఎన్నికలప్పుడు నిద్రలేచి ఎన్నో హామీలు గుప్పించి మళ్లీ వాటి గురించి పట్టించుకోకుండా వెళ్లిపోతారని అన్నారు. వైసీపీ నంద్యాల ఎన్నికల్లో పోటీకి దిగింది కాబట్టే చంద్రబాబు నాయుడు మళ్లీ ఈ ప్రాంతంపై ప్రేమ చూపిస్తున్నారని ఆయన అన్నారు.
చంద్రబాబు నాయుడి మోసాలకు వ్యతిరేకంగా ఓటు వేయాలని జగన్ పిలుపునిచ్చారు. ముఖ్యమంత్రి కావడం కోసం మూడున్నరేళ్ల క్రితం చంద్రబాబు నాయుడు చెప్పిన మాటలని ఒక్కసారి గుర్తు తెచ్చుకోండని అన్నారు. మళ్లీ ఇప్పుడు ఎలా ప్రవర్తిస్తున్నారో గమనించండని పేర్కొన్నారు. రైతులకు, డ్వాక్రా మహిళలకు రుణమాఫీలేదని, యువతకు జాబులులేవని, నిరుద్యోగ భృతి కూడా ఇవ్వడం లేదని చంద్రబాబు నాయుడు ఈ మూడున్నరేళ్లలో ఏం చేశారని జగన్ నిలదీశారు. డ్వాక్రా మహిళల రుణాలు ఒక్కరూపాయి కూడా మాఫీకాలేదని విమర్శించారు. నంద్యాలలో తమ అభ్యర్థినే గెలిపించాలని కోరారు.