: బ్లూవేల్‌ ఆన్‌లైన్ గేమ్‌ బారిన పడి.. ముఖానికి కవర్‌ చుట్టుకొని.. భారత్ లో మరో విద్యార్థి ఆత్మహత్య

ప్రపంచ వ్యాప్తంగా ఇప్ప‌టికే ఎంతో మంది ప్రాణాల‌ను తీసిన బ్లూవేల్‌ ఆన్‌లైన్ గేమ్‌కి తాజాగా మ‌రో విద్యార్థి బ‌లైపోయాడు. ఈ వీడియోగేమ్ ఆడుతున్న వారు 50 దశలు పూర్తి చేసిన తర్వాత చివ‌రి టాస్క్‌గా ఆత్మ‌హత్య చేసుకోవాల్సి ఉంటుంది. పశ్చిమ బెంగాల్‌లోని మిడ్నాపూర్‌ జిల్లాలో ఓ విద్యార్థి ఈ గేమ్‌పై ఆస‌క్తి పెంచుకుని దాన్ని ఆడి చివ‌రికి ప్రాణాలు తీసుకున్నాడు. పదవ‌ తరగతి విద్యార్థి అంకన్‌ నిన్న పాఠ‌శాల నుంచి వచ్చిన తర్వాత స్నానం చేసి వస్తానని చెప్పి బాత్‌రూమ్‌లోకి వెళ్లాడు. మెడచుట్టూ పాలిథిన్‌ కవర్‌ను గట్టిగా చుట్టుకొని ఆత్మహత్య చేసుకున్నాడు.

అంత‌కు ముందే ఆ విద్యార్థి బ్లూవేల్‌ గేమ్‌ ఆడుతూ కనిపించినట్లు తెలిసింది. బాత్‌రూమ్‌లో పడి ఉన్న అత‌డిని గమనించిన తల్లిదండ్రులు ఆసుపత్రికి తీసుకెళ్లారు. అయితే, అప్ప‌టికే ఆ బాలుడు ప్రాణాలు కోల్పోయాడ‌ని వైద్యులు నిర్ధారించారు. కాగా, ఇటీవ‌లే ముంబయికి చెందిన తొమ్మిదవ‌ తరగతి విద్యార్థి ఒక‌రు బ్లూవేల్ గేమ్ బారిన‌ప‌డి ఎత్తైన భవనం మీద నుంచి కిందకి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. దీంతో ఈ బ్లూవేల్‌ గేమ్ భూతం భారత్‌లోనూ హ‌ల్‌చ‌ల్ చేస్తోంద‌ని తొలిసారిగా తెలిసింది. ఇప్పటికే ఈ గేమ్ బారిన‌ప‌డి ప‌లు దేశాల్లో చాలా మంది ఆత్మ‌హ‌త్య చేసుకున్నారు.  

More Telugu News