: మళ్లీ టేప్ రికార్డు ఆన్ చేసిన చంద్రబాబు!: నవ్వులు పూయించిన జగన్ ప్రసంగం

తన రెండో రోజు నంద్యాల పర్యటనలో ప్రజల నుంచి వచ్చిన స్పందనతో జగన్ కళ్లలో ఆనందం స్పష్టంగా కనిపిస్తుండగా, ఉత్సాహంగా ముందుకు సాగుతూ, చంద్రబాబు వైఖరిని ఆయన ఎండగడుతున్నారు. ఈ క్రమంలో చాబ్రోలు ప్రాంతంలో ప్రజలు, కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడుతూ, నవ్వులు పూయించారు. గతంలో మ్యానిఫెస్టోలో ఇచ్చిన ఏ ఒక్క వాగ్దానాన్నీ నెరవేర్చని ఆయన, తిరిగి ఇప్పుడు ఓట్ల కోసం వచ్చి, ఆ పాత టేప్ రికార్డును తిరిగి ఆన్ చేశారని జగన్ ఎద్దేవా చేయగా, ప్రసంగాన్ని వింటున్న వారిలో నవ్వులు పూశాయి.

గతంలో చెప్పిన హామీలనే మళ్లీ చెప్పి ప్రజలను మోసం చేస్తున్నారని, చిన్న చిన్న నేతలకు డబ్బులిస్తూ, కొనుగోలు చేస్తున్నారని, డబ్బుతో ఏదైనా చేయవచ్చని భావిస్తున్న చంద్రబాబుకు బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. మూడున్నరేళ్ల కాలంలో ఒక్క హామీనీ నిలబెట్టుకోలేని చంద్రబాబు, నేడు దారుణమైన పరిస్థితిని ఎదుర్కొంటున్నారని అన్నారు. ఈ ఎన్నికల్లో టీడీపీకి బుద్ధి చెప్పేందుకు ప్రజలు సన్నద్ధం కావాలని కోరారు. తన వద్ద పదవులు, పోలీసు బలం లేదని, తన తండ్రి ఇచ్చి వెళ్లిన ఇంత పెద్ద కుటుంబమే తన ఆస్తని అన్నారు. తన తండ్రి మాదిరిగానే నవరత్నాల పథకాలను ప్రకటించానని గుర్తు చేసిన ఆయన, వాటితో ప్రతి ఇంటిలో వెలుగులు నింపుతానని హామీ ఇచ్చారు.

More Telugu News