: సినిమా నచ్చకపోతే నచ్చలేదని చెప్పే హక్కు ప్రతి ఒక్కరికీ ఉంది... ఆ జర్నలిస్టును గౌరవించండి: హీరో విజయ్ ప్రకటన

బాలీవుడ్ బాద్షా షారూఖ్ ఖాన్, విరాట్ కోహ్లీ ప్రియురాలు అనుష్కా శర్మ కలసి నటించిన జబ్ హ్యారీ మెట్ సెజెల్ సినిమా దారుణమైన ఫలితాన్ని చవి చూసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో బెంగళూరులో ఆ సినిమా చూసిన మహిళా జర్నలిస్టు ధన్య రాజేంద్రన్ సినిమా షాకింగ్ గా ఉందని, గతంలో తాను చూసిన హీరో విజయ్ సినిమా సురా గుర్తుకొచ్చిందని, కనీసం ఇంటర్వెల్ వరకు కూడా సినిమా చూడలేకపోయానని పేర్కొనడం, దీనిపై విజయ్ అభిమానులు తీవ్ర స్థాయిలో ఆమెపై ఆగ్రహం వ్యక్తం చేయడం విదితమే.

రాయలేని పదజాలంతో మూడు రోజులపాటు 63,000 ట్వీట్లలో ఆమెను దూషించారు. కొంత మంది ఆమెను బెదిరించారు. దీంతో ఆమె పోలీసులను ఆశ్రయించింది. ఈ నేపథ్యంలో హీరో విజయ్ తన ట్విట్టర్ ద్వారా అభిమానులకు సూచన చేశారు. ‘మహిళల పట్ల నాకు గౌరవం ఉంది. సినిమా నచ్చకపోతే బాగాలేదు అని చెప్పే స్వేచ్ఛ ఎవ్వరికైనా ఉంటుంది. కాబట్టి మహిళల గురించి తప్పుగా మాట్లాడం వంటివి చేయొద్దు, ఆమెను గౌరవవించండి’ అంటూ తన అభిమానులకు విజయ్ సూచించారు. 

More Telugu News