: సాయంత్రం రమ్మని చెప్పిన ప్రియురాలికి సర్ ప్రైజ్ ఇద్దామని ముందే వెళ్లి, షాక్ తిని ఘోర నిర్ణయం తీసుకున్న యువకుడు!

తమను వృద్ధాప్యంలో ఆదుకుంటాడని ఆశించిన ఆ తల్లిదండ్రుల ఆశలు అడియాసలయ్యాయి. ప్రేమించిన యువతి మోసం చేసిందని తెలుసుకున్న ఓ విద్యావంతుడు, ఇక తనకు భవిష్యత్ లేదని భావిస్తూ, ఆ అమ్మాయి బాగోతాన్ని బట్టబయలు చేసి మరీ రైలు కింద తలపెట్టి ఆత్మహత్య చేసుకున్న తీరు ప్రతి ఒక్కరినీ కలచి వేస్తోంది. తన ప్రియురాలితో దిగిన ఫోటోలను, తన ఆత్మహత్యకు గల కారణాలనూ ఫేస్ బుక్ లో పెట్టి మరీ ఈ యువకుడు ఆత్మహత్య చేసుకోగా, అదిప్పుడు వైరల్ అయింది. యువకుడిని మోసం చేసిన యువతి వైఖరిని వేల మంది విమర్శిస్తున్నారు.

మరిన్ని వివరాల్లోకి వెళితే, సింగరేణి ఎస్సార్సీ-3 గనిలో పనిచేసే మేకా మల్లయ్య చిన్న కుమారుడు నరేష్. ఎంబీఏ వరకూ చదివి, ఆపై చెన్నై క్యాప్ జెమినీ సంస్థలో ప్రాసెస్ అసోసియేట్ గా చేరాడు. శ్రీరాంపూర్‌లోని కృష్ణాకాలనీకి చెందిన ఒక యువతితో ప్రేమలో పడ్డాడు. ఆమె కూడా ఎంబీఏ చదువుకుని హైదరాబాద్ లో పని చేస్తుండగా, చెన్నైలోని ఉద్యోగాన్ని ఆమె కోసం వదులుకుని హైదరాబాద్ కు మకాం మార్చాడు. నాలుగేళ్ల పాటు వారు కలసి తిరిగారు. ఈ క్రమంలో ఏం జరిగిందో ఏమో... ఇద్దరి మధ్యా ప్రేమ బెడిసికొట్టింది. నిన్ను పెళ్లి చేసుకోబోయేది లేదని ఆమె తెగేసి చెప్పింది. దీన్ని నరేష్ తట్టుకోలేకపోయాడు.

ఆత్మహత్యకు గల కారణాలపై నరేష్ తన ఫేస్ బుక్ లో పెట్టిన సమాచారం ప్రకారం, గత సోమవారం నాడు ఆమె పుట్టిన రోజు కావడంతో కలుద్దామని అడిగాడు. ఉదయం పూట తన అన్నయ్య వస్తున్నాడని, బయటకు రాలేనని, సాయంత్రం కలుస్తానని చెప్పింది. సాయంత్రం వరకూ వేచి చూడలేక, ముందుగానే ఆమె ఉన్న హాస్టల్ వద్దకు వెళ్లాడు నరేష్. ఆమె మరో యువకుడితో సన్నిహితంగా ఉండటం చూసి హతాశుడయ్యాడు. అతని వల్లే గతంలో తాము గొడవపడ్డామన్న విషయాన్ని గుర్తు చేసుకున్నాడు. ఈ మొత్తం విషయాన్ని ప్రస్తావిస్తూ, ముగ్గురి పేర్లు చెబుతూ, తల్లిదండ్రులను క్షమించాలని కోరుతూ లేఖను ముగించిన నరేష్, సికింద్రాబాద్ లో భాగ్యనగర్ ఎక్స్ ప్రెస్ రైలు ఎక్కి, హసన్ పర్తి చేరుకుని, ఆత్మహత్య చేసుకున్నాడు. విషయం తెలుసుకున్న పోలీసులు, కేసు నమోదు చేసి విచారణ ప్రారంభించారు.

More Telugu News