: అందుకే జగన్ ను వైఎస్సార్ హైదరాబాద్‌కు రానివ్వలేదు: చంద్రబాబు

తన పదవికి ఎసరు తెస్తాడనే భయంతోనే అప్పట్లో తన కుమారుడు జగన్ ని వైఎస్ రాజశేఖర్ రెడ్డి హైదరాబాద్‌కు రానీయలేదని ఏపీ ముఖ్య‌మంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. అమరావతి సచివాలయంలో ఈ రోజు చంద్ర‌బాబు నాయుడు మీడియాతో మాట్లాడుతూ... గ‌తంలో చిత్తూరు జిల్లా అలిపిరిలో తనపై నక్సలైట్లు దాడి చేసినప్పుడు వైఎస్సార్‌ నిరసన కార్యక్రమంలో పాల్గొన్నారని, వైఎస్ సానుభూతితోనే నిరసన తెలిపారని అంతా అనుకున్నార‌ని, అయితే, ఆయ‌న పేరు బయటకు వస్తుందన్న భయంతోనే వైఎస్ నిరసనలో పాల్గొన్నారని ఆరోపించారు.

అప్పట్లో నక్సలైట్లకు గంగిరెడ్డి సాయం చేశాడ‌ని చంద్రబాబు అన్నారు. సీఎం అయ్యాక కూడా వైఎస్సార్‌ గంగిరెడ్డి ఇంటికి వెళ్లాలని చూశారని చంద్ర‌బాబు వ్యాఖ్యానించారు. కాగా, రేపు విశాఖ ఏజెన్సీలో తాను పర్యటించ‌నున్న‌ట్లు చంద్ర‌బాబు చెప్పారు. అక్క‌డ జ‌రుపుతున్న‌ ప్రపంచ ఆదివాసీ దినోత్సవంలో పాల్గొంటాన‌ని అన్నారు. తాము రాష్ట్ర అభివృద్ధిని దృష్టిలో ఉంచుకొని రాష్ట్రంలో ఎన్నో కార్య‌క్రమాలు చేప‌డుతున్నామ‌ని అన్నారు. ప్రతి నెల బ్యాంకర్లతో సమావేశం, గుంటూరు జిల్లా బొల్లాపల్లి వద్ద రూ.60 వేల కోట్లతో రిజర్వాయర్‌ నిర్మాణానికి ప్రణాళిక, జర్నలిస్టులకు ట్రిపుల్‌ బెడ్‌రూం ఇళ్లు ఇవ్వడానికి ప్ర‌ణాళిక‌ వంటి కార్య‌క్ర‌మాలు చేప‌డుతున్నామ‌ని అన్నారు. మూడు నెలల్లో పోలవరానికి ఓ రూపు తెస్తున్నామ‌ని అన్నారు. గ‌త‌నెల 1 నుంచి ప్ర‌వేశ‌పెట్టిన‌ జీఎస్టీతో ఏపీలో కొన్ని సమస్యలు ఉన్నాయని పేర్కొన్నారు. 

More Telugu News