: ఇంకొకసారి లెటర్ చదువుకో: రామ్ గోపాల్ వర్మకు పి.కిరణ్ సూచన

డ్రగ్స్ వ్యవహారం నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వానికి ఫిల్మ్ ఛాంబర్, మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ లు కలసి లేఖ రాసిన సంగతి తెలిసిందే. ఈ లేఖపై ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ మండిపడ్డారు. డ్రగ్స్ వ్యవహారంలో ఇంతవరకు ఎవరూ దోషులుగా తేలలేదని, తాము తప్పు చేసినట్టు విచారణను ఎదుర్కొన్న ఏ ఒక్కరూ ఒప్పుకోలేదని... ఇలాంటి నేపథ్యంలో, ప్రభుత్వానికి క్షమాపణ చెబుతున్నట్టు లేఖ రాయడం ఏంటని వర్మ ప్రశ్నించారు. క్షమాపణ చెప్పడమంటే తప్పు చేసినట్టు అంగీకరించడమేనని పేర్కొంటూ ఫిల్మ్ ఛాంబర్ కు వర్మ లేఖ రాశారు.

ఈ నేపథ్యంలో నిర్మాతల సంఘం నూతన అధ్యక్షుడు పి.కిరణ్ ఓ టీవీ ఛానల్ తో మాట్లాడుతూ... ప్రభుత్వానికి తాము రాసిన లేఖను వర్మ మరోసారి చదువుకోవాలని సూచించారు. తాము ప్రభుత్వాన్ని క్షమాపణ కోరలేదని ఆయన తెలిపారు. డ్రగ్స్ వ్యవహారంలో అందరూ చిత్రపరిశ్రమను వేలెత్తి చూపడం తమకు బాధ కలిగించిందని చెప్పారు. ఈ నేపథ్యంలో, పరిశ్రమకు చెడ్డ పేరు రాకుండా, విచారణ చేపట్టాలని ప్రభుత్వాన్ని కోరామని తెలిపారు. 

More Telugu News