: రోజా గారూ, నంద్యాల గురించి మాట్లాడండి... ఎవరెవరి గురించో ఎందుకు మాట్లాడుతారు?: అఖిల ప్రియ

"రోజా గారూ! శిల్పా చక్రపాణిరెడ్డి గురించి నేను మాట్లాడుతుంటే... మీరు బాలకృష్ణ, బొండా ఉమ, బుద్ధా వెంకన్నల గురించి మాట్లాడుతున్నారు? వారి గురించి ఎందుకు? నంద్యాల గురించి మాట్లాడండి?" అని మంత్రి భూమా అఖిల ప్రియ వ్యాఖ్యానించారు. ఒక టీవీ ఛానెల్ నిర్వహించిన లైవ్ ఇన్ కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ, తాను నంద్యాల గురించి మాట్లాడితే, దాని గురించి మాట్లాడడం మానేసి, ఇతరులను అడగాల్సిన మాటలు తనను అడగడం ఎంతవరకు సబబని ఆమె ప్రశ్నించారు. ఈ సందర్భంగా మహిళలపై శిల్పా చక్రపాణిరెడ్డి చేసిన వ్యాఖ్యలను రోజా సమర్థిస్తున్నారా? అని మంత్రి ప్రశ్నించారు.

అదే చర్చా కార్యక్రమంలో పాల్గొన్న రోజా వెంటనే అందుకుని, బాలకృష్ణ సినిమా ఫంక్షన్లో మహిళలు ముద్దులు పెట్టడానికి పనికొస్తారనడం కరెక్టా? బొండా ఉమ అసెంబ్లీలో తనను విమర్శించడం కరెక్టా? బుద్ధా వెంకన్న తన సినిమాల్లో పాత్రల గురించి విమర్శించడం కరెక్టా? అంటూ అడిగారు. దీంతో తాను రాజకీయాలకు కొత్త అని, తాను రాజకీయాలు చేయడం నేర్చుకోలేదని, తాను చాలా ఓపెన్ గా మాట్లాడుతున్నానని అఖిల ప్రియ స్పష్టం చేశారు. రోజాగారు ఏవైనా సలహాలిస్తే తెలుసుకుంటానని ఆమె స్పష్టం చేశారు. 

More Telugu News