: టీడీపీలో దుమారం రేపుతున్న టీజీ వెంకటేశ్ కుమారుడి సంచలన ప్రకటన!

2019లో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో కర్నూలు నియోజకవర్గం నుంచి తాను బరిలోకి దిగనున్నానని టీడీపీ యూత్ కార్యాలయం ప్రారంభోత్సవం సందర్భంగా ఎంపీ టీజీ వెంకటేశ్ కుమారుడు భరత్ చేసిన ప్రకటన ఇప్పుడు ఆ పార్టీలో దుమారం రేపుతోంది. ఆయన వ్యాఖ్యలకు మరింత ఆజ్యం పోస్తూ, కర్నూలు అభ్యర్థిని తానేనని ప్రస్తుత ఎమ్మెల్యే ఎస్వీ మోహన్ రెడ్డి కౌంటర్ ఇస్తూ, భరత్ ఏ పార్టీ నుంచి పోటీ చేస్తాడో చెప్పాలని డిమాండ్ చేశారు. ప్రస్తుత ఎమ్మెల్యే ఎస్వీ మోహన్ రెడ్డికి సిట్టింగ్ ఎమ్మెల్యేగా మరోసారి అవకాశం ఖాయమని తెలుస్తుండగా, టీజీ, ఎస్వీలు సమన్వయంతో పని చేయాలని చంద్రబాబు ఎన్నోమార్లు హెచ్చరించారు.

 ఇక తాజాగా, ఎన్నికల బరిలో ఉంటానని భరత్, టీడీపీ టికెట్ తనదేనని ఎస్వీ మోహన్ రెడ్డి పోటాపోటీ ప్రకటనలు చేస్తుండటంతో కర్నూలులో ఇదే ఇప్పుడు హాట్ టాపిక్. కాగా, 2014 ఎన్నికల్లో కర్నూలు అసెంబ్లీ నుంచి టీజీ వెంకటేశ్ టీడీపీ తరఫున, మోహన్ రెడ్డి వైకాపా తరపున పోటీ చేయగా, మోహన్ రెడ్డి గెలిచిన సంగతి తెలిసిందే. ఆపై జరిగిన ఫిరాయింపు రాజకీయాల్లో భాగంగా మోహన్ రెడ్డి టీడీపీలోకి వచ్చి చేరారు. దీంతో తమ కుటుంబానికి భవిష్యత్ ఏంటని టీజీ గతంలోనే ప్రశ్నించారు కూడా. వీరి మధ్య నెలకొన్న విభేదాలను తెలుగుదేశం అధిష్ఠానం ఎలా కూల్ చేస్తుందో వేచి చూడాలి.

More Telugu News