: కాగ్నిజెంట్‌లో కొనసాగుతున్న ఉద్యోగుల తొలగింపు... 9 నెలల వేతనానికి అంగీకరించిన 400 మంది!

ప్రముఖ ఐటీ సంస్థ కాగ్నిజెంట్‌లో ఉద్యోగుల తీసివేతల పర్వం కొనసాగుతోంది. ఇప్పటికే వేలాదిమందిని ఇంటికి పంపిన సంస్థ తాజాగా మరో 400 మంది సీనియర్ ఎగ్జిక్యూటివ్‌లకు ఉద్వాసన పలికింది. అయితే వీరంతా సంస్థ ప్రకటించిన వాలంటరీ సెపరేషన్ ప్యాకేజ్ (వీఎస్‌పీ)కి అంగీకరించినట్టు కాగ్నిజెంట్ తెలిపింది. వీఎస్‌పీలో భాగంగా ఇష్టపూర్వకంగా సంస్థను వదిలి వెళ్లే ఉద్యోగులకు 9 నెలల వేతనం చెల్లించనున్నారు. వీఎస్‌పీ తీసుకున్న వారిలో అత్యధికులు భారతీయులేనని తెలుస్తోంది. అయితే ఈ విషయాన్ని సంస్థ ధ్రువీకరించలేదు.

మరోవైపు ఉద్యోగుల తొలగింపు ద్వారా సంస్థకు ఏటా ఆరుకోట్ల డాలర్లు ఆదా అవుతాయని కంపెనీ సీఈఓ కరెన్ మెక్‌లోలిన్ తెలిపారు. ప్రస్తుతం కాగ్నిజెంట్‌లో ప్రపంచవ్యాప్తంగా 2.56 లక్షల మంది ఉద్యోగులు ఉన్నారు. గతేడాదితో పోలిస్తే ఉద్యోగుల సంఖ్య 4,400 తగ్గడం గమనార్హం.

More Telugu News