: గోపాలకృష్ణ గాంధీనే గుర్తుపట్టలేకపోయిన హేమమాలిని!

నిన్న జరిగిన ఉపరాష్ట్రపతి ఎన్నికల పోలింగ్ లో ఓ ఆసక్తికర సంఘటన చోటుచేసుకుంది. తన ఓటు వేసేందుకు పార్లమెంట్ కు వెళ్లిన బీజేపీ ఎంపీ, డ్రీమ్ గర్ల్, నాటి సినీ నటి హేమమాలిని.. ప్రతిపక్షాల ఉపరాష్ట్రపతి అభ్యర్థి గోపాలకృష్ణ గాంధీని గుర్తుపట్టలేకపోయారు. ఓటు వేసేందుకు హేమమాలిని అక్కడికి చేరుకోగానే మీడియా, ఫొటోగ్రాఫర్లు ఆమెను చుట్టుముట్టేశారు. ఆ తర్వాత, కొంచెం సేపటికి, గోపాలకృష్ణ గాంధీ అక్కడికి రావడంతో మీడియా మొత్తం ఆయన వద్దకు చేరారు.

దీంతో, ‘ఆయన ఎవరు?’ అంటూ అక్కడి మీడియాను హేమమాలిని ప్రశ్నించింది. దీంతో, బిత్తరపోయిన మీడియా, ఆమెకు ఆయనెవరో తెలియజెప్పారు. వెంటనే, గోపాలకృష్ణ గాంధీ వద్దకు వెళ్లిన హేమమాలిని, తనను తాను పరిచయం చేసుకున్నారు. దీనికి ఆయన స్పందిస్తూ, ‘మిమ్మల్ని ఎవరు గుర్తుపట్టరు హేమాజీ!’ అంటూ సరదగా వ్యాఖ్యానించడం కొసమెరుపు.

More Telugu News