: నీతి ఆయోగ్‌కు కొత్త వైస్ చైర్మన్ వచ్చేశారు.. రాజీవ్ కుమార్‌ను నియమించిన ప్రభుత్వం

నీతి ఆయోగ్‌కు కొత్త వైస్ చైర్మన్ వచ్చేశారు. ఆర్థికవేత్త డాక్టర్ రాజీవ్ కుమార్‌ను ప్రభుత్వం నీతి ఆయోగ్ కొత్త వైస్ చైర్మన్‌గా నియమించింది. అరవింద్ పనగారియా వైస్ చైర్మన్ పదవికి రాజీనామా చేసి టీచింగ్‌లో కొనసాగనున్నట్టు ప్రకటించిన ఐదు రోజుల తర్వాత ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. అలాగే ఎయిమ్స్‌లోని చిన్నపిల్లల వైద్య నిపుణుడైన డాక్టర్ వినోద్ పాల్‌ను నీతి ఆయోగ్ సభ్యుడిగా నియమించింది.

రాజీవ్ కుమార్ ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీ నుంచి ఎకనమిక్స్‌లో డీఫిల్ పట్టా అందుకున్నారు. లక్నో యూనివర్సిటీ నుంచి పీహెచ్‌డీ పూర్తి చేశారు. ప్రస్తుతం ఆయన సెంటర్ ఫర్ పాలసీ రీసెర్చ్ (సీపీఆర్)లో సభ్యుడిగా ఉన్నారు. అలాగే ఫిక్కికి సెక్రటరీ జనరల్‌గానూ పనిచేశారు. ఇండియన్ కౌన్సిల్ ఫర్ రీసెర్చ్ ఆన్ ఇంటర్నేషనల్ ఎకనమిక్ రిలేషన్స్ (ఐసీఆర్ఐఈఆర్)కు డైరెక్టర్, చీఫ్ ఎగ్జిక్యూటివ్‌గా పనిచేశారు. 2006 నుంచి 2008 వరకు జాతీయ భద్రతా సలహా బోర్డులో సభ్యుడిగా ఉన్నారు.

More Telugu News