: సూర్య‌కుమారి కేసులో కొత్త మ‌లుపు.... కాలువ‌లోకి దూకి ఆత్మ‌హత్య‌కు పాల్ప‌డిన‌ట్లు పోలీసుల అనుమానం

విజ‌య‌వాడ‌లో ఐదు రోజుల క్రితం అదృశ్య‌మైన సూర్య‌కుమారి కేసులో కొత్త మ‌లుపు చోటుచేసుకుంది. విజ‌య‌వాడ గుండా ప్ర‌వ‌హించే రైవ‌స్ కాలువ‌లో దూకి ఆమె ఆత్మ‌హ‌త్య చేసుకున్న‌ట్లు పోలీసులు అనుమానం వ్య‌క్తం చేస్తున్నారు. 27-30 ఏళ్ల వ‌య‌సున్న యువ‌తిని కాలువ ఒడ్డున చూసిన‌ట్లు, ఆమెకు చెందిన బైక్‌, చెప్పులు దొరికిన‌ట్లు స్థానికులు ఇచ్చిన స‌మాచారం మేర‌కు వారు ఈ కోణంపై దృష్టిసారిస్తున్నారు.

ప్ర‌స్తుతం 27 మంది ప్ర‌త్యేక పోలీసుల బృందం రైవ‌స్ కాలువ‌లో గాలింపు ప‌నులు చేప‌ట్టింది. రైవ‌స్ కాలువ ప్ర‌వాహం ఎక్కువ‌గా ఉండ‌టం వ‌ల్ల కాలువ మొత్తం గాలించ‌డం కొంచెం క‌ష్ట‌మైన ప‌నే అని ఎన్డీఆర్ఎఫ్ బృందం అభిప్రాయప‌డుతోంది. మరోపక్క, త‌మ కూతురు ఏమై ఉంటుందోన‌ని సూర్య‌కుమారి త‌ల్లిదండ్రులు ఆందోళ‌న చెందుతున్నారు. ఈ కేసులో ఇప్ప‌టికే విద్యాసాగ‌ర్ అనే వ్య‌క్తిని పోలీసులు విచారించారు. అదృశ్య‌మ‌వ‌డానికి ముందు సూర్య‌కుమారి, విద్యాసాగ‌ర్ ఇంటికి వెళ్లిన సంగ‌తి తెలిసిందే!

More Telugu News